5వ తరగతి వరకు మాతృభాషలో విద్యాబోధన అవసరం
ప్రధాని మోడీ పునరుద్ఘాటన
న్యూఢిల్లీ: దేశం 75 స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోనున్న 2022 సంవత్సరం నుంచి విద్యార్థులు నూతన జాతీయ విద్యా విధానంలో(ఎన్ఇపి) భాగంగా రూపొందించిన కొత్త పాఠ్యాంశాలను చదువుతారని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకించారు. ఈ కొత్త పాఠ్యాంశాలు దార్శనికంగా, భవిష్యత్ అవసరాలకు తగినట్లు వైజ్ఞానికంగా ఉంటాయని ఆయన తెలిపారు. ఎన్ఇపి-2020 కింద 21వ శతాబ్దంలో పాఠశాల విద్య అనే అంశంపై శుక్రవారం జరిగిన ఒక సదస్సునుద్దేశించి ఆయన వీడియో సందేశమిస్తూ విద్యార్థులు కనీసం 5వ తరగతి వరకు తమ మాతృభాషలో లేదా స్థానిక భాషలో చదువుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంతైనా ఉందని పునరుద్ఘాటించారు.
అయితే విద్యార్థులు ఏ భాషనైనా నేర్చుకునే సౌలభ్యాన్ని ఎన్ఇపి కల్పిస్తుందని, ఇందులో ఎటువంటి ఆంక్షలు ఉండబోవని, తమకు ఉపయోగపడుతుందని భావించే ఇంగ్లీషుతోసహా ఏ అంతర్జాతీయ భాషనైనా విద్యార్థులు చదువుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు.ఈ విషయంలో ఎవరికీ ఎటువంటి అభ్యంతరాలు లేవని అంటూనే భారతీయ భాషలను ప్రోత్సహించవలసిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. గడచిన మూడు దశాబ్దాలలో ప్రపంచం ఎంతో మారిపోయిందని, కాని..మన విద్యా విధానం మాత్రం అలాగే ఉండిపోయిందని ఆయన అన్నారు. ప్రస్తుత విధానంలో మార్కుల జాబితా విద్యార్థులకు ఒత్తిడి జాబితాగా మారగా వారి తల్లిదండ్రులకు ప్రతిష్ట జాబితాగా మారిందని ప్రధాని వ్యాఖ్యానించారు. కాగా..ఈ ఒత్తిడులను తొలగించడమే నూతన విధానం లక్షమని ఆయన చెప్పారు.
నూతన విద్యా విధానం 21వ శతాబ్దంలో దేశానికి కొత్త మార్గనిర్దేశం చేస్తుందని, నవ శకానికి బీజం వేస్తుందని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే.. అనుకున్న పని ఇంకా పూర్తి కాలేదని, ఎన్ఇపిని అందరం కలసి అంతే సమర్ధంగా అమలుచేయవలసి ఉందని ఆయన అన్నారు. నూతన విద్యా విధానంపై దేశవ్యాప్తంగా సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతోందని ఆయన తెలిపారు. ఎన్ఇపి గురించి ప్రజలకు చాలా సందేహాలు ఉన్నాయని, అవన్నీ న్యాయబద్ధమైనవేనని ఆయన అన్నారు. ఎన్ఇపి అమలుపై విద్యా మంత్రిత్వ శాఖ అభిప్రాయాలను కోరిన వారం రోజుల్లోనే మైగవర్నమెంట్ పోర్టల్కు 15 లక్షలకు పైగా సలహాలు ఉపాధ్యాయుల నుంచి వచ్చాయని ఆయన వెల్లడించారు.
New Education System in India 2020