హైదరాబాద్: నిర్భయ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. నలుగురు దోషుల్లో శనివారం ముగ్గురికి ఉరి తీయనున్నారు. వినయ్ క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్లో ఉండడంతో వినయ్ ఉరిని ఆపాలని ప్రభుత్వం కోర్టును కోరింది. మిగిలిన ముగ్గురు దోషులను ఉరి తీసేందుకు తీహార్ జైలు అధికారులు ఏర్పాట్లు చేశారు. మహిళలపై జరిగే హింసలకు సంబంధించిన కేసుల్లో ఆధారాలతో సంబంధం లేకుండా ప్రజల ఒత్తిడి, వారి అభిప్రాయాలకు ప్రకారం కోర్టులు మరణశిక్ష విధిస్తున్నాయని, శిక్షల్ని తగ్గించడం లేదని అక్షయ్ బుధవారం సుప్రీంకోర్టులో వేసిన క్యురేటివ్ పిటిషన్లో పేర్కొన్నవిషయం తెలిసిందే. క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేయడం ఒక వ్యక్తికి న్యాయపరంగా ఉన్న చివరి అవకాశం.‘నేరంలోని క్రూరత్వాన్నిబట్టే అందుకు తగిన విధంగా సుప్రీంకోర్టు మరణశిక్ష విధిస్తుందని నమ్ముతున్నాను.
కానీ ఈ కోర్టుకు, దేశంలో ఇతర క్రిమినల్ కోర్టులకు అలాంటి నిశ్చితాభిప్రాయం లేదు. రేప్, హత్యకు సంబంధించిన 17 కేసుల్లో ముగ్గురు జడ్జీలున్న సుప్రీం ధర్మాసనం మరణశిక్షనే విధించింది’ అని అక్షయ్ తన పిటిషన్లో పేర్కొన్నాడు. గతంలో నిర్భయ సామూహిక అత్యాచారం కేసులో క్యురేటివ్ పిటిషన్లను దాఖలు చేసుకున్న నేరస్థుల్లో అక్షయ్ మూడో వ్యక్తి. అంతకు ముందు ఇదే కేసులో నేరస్థులు వినయ్, ముఖేష్ల క్యురేటివ్ పిటిషన్లను సుప్రీంకోర్టు ఇదివరకే డిస్మిస్ చేసింది. నాలుగో నేరస్థుడు పవన్గుప్తా క్యురేటివ్ దాఖలు చేయలేదు. అయితే, అతనికి అవకాశం ఉంది. ఈ కేసులో మిగిలిన దోషులు ముకేష్ (32), పవన్ (25), అక్షయ్ (31) లకు ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలకు ఉరిశిక్ష అమలు చేయనున్నారు . అంతకు ముందు జనవరి 22న ఉరిశిక్ష అమలు చేయాలని ట్రయల్ కోర్టు జనవరి 7న ఆదేశించింది.