చెన్నై: దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ) వల్ల ముస్లిములకు వచ్చిన ప్రమాదమేమీ ఉండదని సూపర్స్టార్ రజనీకాంత్ అభిప్రాయపడ్డారు. బుధవారం చెన్నై విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశానికి జాతీయ పౌర పట్టిక(ఎన్పిఆర్) కూడా ఎంతో ఎంతో అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. సిఎఎ వల్ల ముస్లిములకు ఎటువంటి ఆపద రాబోదని, ఒకవేళ వారికి ఏ విధమైన ఇబ్బంది తలెత్తినా ముందుగా వ్యతిరేకించేది తానేనంటూ ఆయన హామీ ఇచ్చారు. సిఎఎ వల్ల భారతీయులకు ఎటువంటి సమస్యలు ఉండబోవని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. దేశ విభజన కాలంలో పాకిస్తాన్కు వెళ్లకుండా భారతదేశంలోనే ఉండిపోయిన ముస్లిములను దేశం నుంచి ఎలా వెళ్లగొడతారని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం సిఎఎకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొడుతున్నాయని ఆయన ఆరోపించారు. సిఎఎకి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలకు మద్దతు ఇస్తున్న కొందరు మత నాయకులను ఆయన తప్పుపడుతూ ఇది చాలా తప్పు అని వ్యాఖ్యానించారు.