Monday, April 29, 2024

పార్లమెంట్ సమావేశాల్లో మణిపూర్ హింసపై చర్చిస్తాం : వామపక్ష ఎంపీలు

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మణిపూర్ హింసను చర్చకు లేవదీస్తామని వామపక్ష ఎంపీల బృందం శనివారం వెల్లడించింది. ఇదే సమయంలో భారత్ కోరితే మణిపూర్ సంక్షోభం పరిష్కారానికి సహకరిస్తామని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి ప్రకటించడాన్ని ఎంపీలు ఖండించారు. మణిపూర్ లోని అన్ని వర్గాల ప్రజల్లో నమ్మకం, మనోనిబ్బరం కలిగించి శాంతి స్థాపన ప్రక్రియకు దోహదం చేసేలా మూడు రోజుల పర్యటనను ఎంపీల బృందం ప్రారంభించింది. ఈ బృందంలో సిపిఎం కు చెందిన రాజ్యసభ ఎంపీలు బికాష్ రంజన్ భట్టాచార్య , జాన్ బ్రిట్టాస్, సిపిఐ రాజ్యసభ సభ్యులు విశ్వం , సందోష్ కుమార్ పి, సిపిఐ లోక్‌సభ సభ్యులు కె. సుబ్బరాయన్ ఉన్నారు. కేంద్ర , రాష్ట్ర పభుత్వాలు మణిపూర్ సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యాయని సిపిఎం రాజ్యసభ సభ్యుడు బికాష్ భట్టాచార్య ఆరోపించారు.

దాదాపు రెండు నెలలకు పైగా మణిపూర్‌లో హింస భగ్గుమంటున్నా ప్రధాని మోడీ ఏమీ చెప్పడం లేదని, ఇది మణిపూర్ ప్రజలపై మోడీ తీవ్ర నిర్లక్షాన్ని చూపిస్తోందని విమర్శించారు. శాంతి ప్రక్రియను ప్రారంభించడానికి ముందు మణిపూర్ లోని అన్ని వర్గాల ప్రజల్లో నమ్మకం, నిబ్బరం కలిగించాల్సిన అవసరం ఉందని, ప్రస్తుత ప్రభుత్వం తన చట్టబద్ధత కోల్పోయిందని సిపిఐ ఎంపీ జాన్ బ్రిట్టాస్ విమర్శించారు. ముఖ్యమంత్రి ఎన్. బీరేంద్ర సింగ్ తప్పనిసరిగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగినప్పుడు ఈ సమస్యలో బీరేన్ సింగ్ ఒక భాగంగా ఉన్నారని , అందువల్ల ఆయన ఎలా ఈ సమస్యను పరిష్కరిస్తారని తాము లేవదీశామని తెలిపారు. మణిపూర్ సమస్య పరిష్కారానికి భారత్ కోరితే సహకరిస్తామని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి వ్యాఖ్యలను ఎంపీలు ఖండించారు.

అమెరికా చేసిన ప్రతిపాదన మణిపూర్ సమస్యలో కొత్త మలుపుగా సిపిఐ ఎంపి బినయ్ విశ్వం విమర్శించారు. సమస్యలను పరిష్కరిస్తామని ఎక్కడ అమెరికా జోక్యం చేసుకున్నా అక్కడ సమస్య మరింత జటిలమవుతుందని తమకు తెలుసని వ్యాఖ్యానించారు. రాజకీయ ఆట ఆడడానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు మార్గం ఏర్పరిచాయని వ్యాఖ్యనించారు. మణిపూర్‌లో పునరావాస శిబిరాలను ఎంపీలు సందర్శించారు. ఇంఫాల్‌తోపాటు చౌరా చాంద్‌పూర్ , దౌబాల్ జిల్లాల్లోని బాధితులతో మాట్లాడారు. గవర్నర్ అనసూయ యుకేను కలుసుకుని చర్చించారు. శుక్రవారం సాయంత్రం మణిపూర్ లోని వివిధ పార్టీల ప్రతినిధులను ఎంపీలు కలుసుకున్నారు. అంతకు ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మణిపూర్‌లో జూన్ 29 నుంచి రెండు రోజుల పాటు పర్యటించిన సంగతి తెలిసిందే

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News