రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలన్న వృద్ధ మహిళ
న్యూఢిల్లీ: దేశంలో 45 ఏళ్ల క్రితం విధించిన అత్యవసరపరిస్థితి(ఎమర్జెన్సీ)ని రాజ్యాంగ విరుద్ధమంటూ వేసిన పిటిషన్పై కేంద్రం నుంచి స్పందన కోరుతూ సుప్రీంకోర్టు నోటీస్ జారీ చేసింది. 94 ఏళ్ల వీరాసారిన్ అనే మహిళ ఈ పిటిషన్ వేశారు. జస్టిస్ సంజయ్కిషన్ కౌల్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఇన్నేళ్ల తర్వాత ఈ పిటిషన్పై విచారణ జరపడం సాధ్యమా.? కాదా..? అన్న అంశాన్ని మొదట పరిశీలించనున్నది. 1975లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నపుడు దేశంలో ఎమర్జెన్సీ విధించారు. ఎమర్జెన్సీ వల్ల తమ కుటుంబం తీవ్రంగా నష్టపోయిందని సారిన్ తన పిటిషన్లో వివరించారు. తమకు ఢిల్లీలో బంగారు కళాఖండాలను అమ్మే వ్యాపారం ఉండేదని ఆమె తెలిపారు.
అకారణంగా తమను అరెస్ట్ చేసి జైలులో వేస్తారన్న భయంతో దేశం విడిచి వెళ్లామని, దాంతో తమ ఆస్తులన్నీ దోపిడీకి గురయ్యాయని ఆమె పేర్కొన్నారు. తీవ్ర ఒత్తిడికి గురైన తన భర్త మరణించారని, ఆ విషాదం తనను జీవితమంతా వెంటాడుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో పౌర హక్కులు, స్వేచ్ఛపై ప్రభుత్వ అణచివేత కొనసాగిందని ఆమె గుర్తు చేశారు. తనను తన బంధువులు, స్నేహితులు కూడా పట్టించుకోలేదని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు. ఎమర్జెన్సీ విధింపు జరిగి ఉండాల్సింది కాదు. అయితే, ఇప్పుడు దానిపై విచారించడం క్లిష్టమైన అంశమని పిటిషన్ను విచారిస్తున్న న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్సాల్వే వాదిస్తున్నారు.