Monday, April 29, 2024

ముగిసిన స్థానిక ఎంఎల్‌సి పోలింగ్

- Advertisement -
- Advertisement -

Polling for MLC positions of local bodies is over

14న కౌంటింగ్

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఐదు ఉమ్మడి జిల్లాల్లోని ఆరు స్థానిక సంస్థల ఎంఎల్‌సి స్థానాలకు పోలింగ్ ముగిసింది. ఆరు ఎంఎల్‌సి స్థానాలకు 26 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఐదు ఉమ్మడి జిల్లాల్లో కార్పోరేటర్లు, కౌన్సిలర్లు, జెడ్‌పిటిసిలు, ఎంపిటిసిలు 5,326 మంది ఓటర్లు ఉండగా, వారి కోసం 37 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా స్థానిక సంస్థల్లో ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఉన్న ఎంపిలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు ఎంఎల్‌సి స్థానాలకు, ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, మెదక్ ఉమ్మడి జిల్లాల్లో ఒక్కో స్థానానికి ఎన్నిక జరిగింది. శుక్రవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు కొవిడ్ నిబంధనల మధ్య పోలింగ్ నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘనటలు చోటు చేసుకోకుండా పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు మధ్య పోలింగ్ ప్రక్రియ పూర్తి చేశారు. అదిలాబాద్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ ఎన్నికల పోలింగ్‌ను పరిశీలించారు.

ఉమ్మడి మెదక్ జిల్లా..

ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 1,026 ఓటర్లకు గానూ.. 1,018 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తంగా 99.22 శాతం పోలింగ్ నమోదైంది. జహీరాబాద్, నారాయణఖేడ్, తూప్రాన్, సిద్దిపేట పోలింగ్ కేంద్రాల్లో 100 శాతం పోలింగ్ నమోదైంది. సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా..

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 1,324 ఓటర్లు ఉండగా.. 1,320 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తంగా 99.70 శాతం పోలింగ్ నమోదైంది. కరీంనగర్ జిల్లాలో 205 మంది ఓటర్లకు గానూ.. ఎంపి బండి సంజయ్ మినహా.. అందరూ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంథనిలో 98 ఓట్లుండగా.. ఎంఎల్‌ఎ దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మినహా.. అందరూ ఓటేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం 201 మంది ఓటర్లుండగా.. 200 మంది ఓటేశారు.

హుజూరాబాద్, జగిత్యాల, కోరుట్ల, పెద్దపల్లి, హుస్నాబాద్ పోలింగ్ కేంద్రాల్లో వంద శాతం పోలింగ్ నమోదైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద మంత్రి కెటిఆర్ ఓటుహక్కును వినియోగించుకున్నారు. కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్ టిఆర్‌ఎస్ ఎంపిటిసి, జెడ్‌పిటిసిలతో కలిసి వచ్చి ఓటు వేశారు.ఎంఎల్‌ఎలు సుంకె రవి శంకర్, రసమయి బాలకిషన్‌లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ మేయర్ రవీందర్ సింగ్ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 96.09 శాతం పోలింగ్ నమోదైంది. ఖమ్మంలో ఎంపి నామ నాగేశ్వరరావు, సిఎల్‌పినేత,ఎంఎల్‌ఎ మల్లు భట్టి విక్రమార్క ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే నిర్మల్‌లోని జిల్లా పరిషత్ కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి… మంచిర్యాలలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎంఎల్‌ఎ దివాకర్ రావు ఓటు వేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 91.78 శాతం, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 97.01 శాతం పోలింగ్ నమోదైంది.

మిగతా ఆరు స్థానాలు ఏకగ్రీవం

మిగతా ఆరుస్థానాల్లో ఇప్పటికే నిజామాబాద్ నుంచి కల్వకుంట్ల కవిత, మహబూబ్‌నగర్ జిల్లాలో కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రంగారెడ్డి జిల్లాలోని రెండు స్థానాలకు పట్నం మహేందర్ రెడ్డి, శంభీపూర్ రాజు ఏకగ్రీవమయ్యారు. వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఎన్నికలు జరిగిన స్థానాలకు ఈ నెల 14వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటించనున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News