పిల్పై కే్రంద్రానికి సుప్రీం నోటీసులు
ముంబయి: రాజ్యాంగ స్ఫూర్తి, అంతర్జాతీయ సంప్రదాయాలకు అనుగుణంగా వైవాహిక వివాదాలలో లింగ, మత సమానత్వం పాటిస్తూ పౌరులందరికీ ఒకే రకమైన కుటుంబ పోషణ, భరణం వర్తింపచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సమాధానమివ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. బిజెపి నాయకుడు, న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై బుధవారం విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ ఎస్ఎ బాబ్డే నేతృత్వలోని సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర హోం వ్యవహారాల శాఖ, న్యాయ శాఖ, మహిళ, శిశు అభివృద్ధి శాఖలకు నోటీసులు జారీచేసింది.
వైవాహిక వివాదాలలో ప్రస్తుతం కుటుంబ పోషణ, భరణం విషయాలలో అసమానతలు ఉన్నాయని, మతం, కులం, తెగలు, లింగ లేదా జన్మ స్థలం వంటి అంశాలకు అతీతంగా దేశ పౌరులందరికీ ఒకే రకమైన పోషణ, భరణం వర్తింపచేసేలా చట్టాలు తీసుకురావాలని పిటిషనర్ కోరారు. మతం జెండర్(లింగ)ను వేర్వేరుగా పరిగణించినప్పటికీ రాజ్యాంగం మాత్రం మహిళ పట్ల ఎటువంటి వివక్ష చూపడానికి అనుమతించబోదని పిటిషనర్ తరఫు న్యాయవాది మీనాక్షి అరోరా వాదించారు.