భోపాల్ : ప్రస్తుత బిజెపి నేత, ఎంపి జ్యోతిరాదిత్య సింధియా మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్కు ఓటేయండని పిలుపు నిచ్చి ఆశ్యర్యపరిచారు. ఇటీవలి కాలం వరకూ కాంగ్రెస్లో యువనేతగా ఎదిగిన సింధియా అలవాటులో పొరపాటుగా సభికులకు ఈసారి అమూల్యమైన ఓటును చేయి గుర్తుకే వేయాలని కోరి, తరువాత వెంటనే తన తప్పు తెలుసుకుని కాదు కాదు కమలానికి ఓటేయండని విజ్ఞప్తి చేశారు. ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఈ నెల 3వ తేదీన ఉప ఎన్నికలు జరుగనున్నాయి. బిజెపి అభ్యర్థుల తరఫున జ్యోతిరాదిత్య సింధియా ఉధృతస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. గ్వాలియర్లోని దబ్రా టౌన్లో ఎన్నికల సభ జరిగింది.
ఉధృత స్థాయిలో ప్రచారం చేస్తున్న యువ సింధియా ఓటర్లకు పిలుపు నిస్తూ బిజెపి అభ్యర్థి ఇమర్తి దేవికి ఓటేయాలని కోరారు. తరువాత సభికులను ఉద్ధేశించి డబ్రా ప్రజలు అంతా తనపైనా , సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్పైనా నమ్మకం ఉంచుతున్నారా లేదా తెలియచేయాల్సి ఉందని, మీరు ఎన్నికల రోజున మీ సత్తా చాటుకోవాలని, చేతి గుర్తు బటన్ను నొక్కాలని పిలుపు నిచ్చారు. వెంటనే సరిదిద్దుకుని పొరపాటందని చెప్పకుండానే కమలం బటన్ నొక్కాలని కోరారు. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ స్పందించింది. సింధియా జీ , మీరు చెప్పినట్లుగానే ప్రజలు ఇవిఎంలలో చేయి గుర్తు బటన్ను నొక్కి మీకు తగువిధమైన భరోసా కల్పిస్తారు లెండని పార్టీ వర్గాలు వ్యాఖ్యానించాయి.