హైదరాబాద్ : ఉల్లి ధరలు కొండెక్కి కూచున్నాయి. కోయకుండానే అవి ప్రజలకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ. 80 నుంచి రూ. 90లు పలుకుతోంది. దాదాపుగా వంద రూపాయలకు చేరువగా ఉల్లి ధర పరుగులు పెడుతోంది. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయలేదనేది సామెత. కానీ వాటిని కొనుగోలు చేయడానికి పేదలు, సామాన్య తరగతి ప్రజలకు ఆర్ధిక పరిస్థితి సరిపోవడం లేదు. దీంతో ఉల్లి కొనాలంటేనే కన్నీ ళ్లు పెట్టే పరిస్థితులొచ్చాయి. ఈ నేపథ్యంలో ఉల్లి ధరలను నియంత్రించే అంశంపై సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో మార్కెటింగ్ శాఖ రంగంలోకి దిగింది, ఉల్లి ధరల నియంత్రణపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పెరిగిన ఉల్లిఘాటు ప్రజలకు తగలకుండా తగు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రైతుబజార్లో ఉల్లి కిలో రూ. 35లకే విక్రయించాలని నిర్ణయం తీసుకున్నారు. జంటనగరాల్లోని 11 రైతు బజార్లో ఈ విక్రయాలను శనివారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏదైన గుర్తింపు కార్డు చూపించి ప్రతి వ్యకిక్తి రెండు కిలోల చొప్పున ఉల్లిని తీసుకునే అవకాశాన్ని కల్పించింది. ప్రస్తుతం భారీ వర్షాలకు దేశవ్యాప్తంగా ఉల్లిపంట బాగా దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలో ఎలాంటి లాభం లేకుండా రవాణా ఖర్చులు, దెబ్బతిన్న సరుకును దృష్టిలో ఉంచుకుని ఈ అమ్మకాలను చేపట్టినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అధికారులు తీసుకున్న ఈ నిర్ణయంతో పేద, సామాన్య ప్రజలకు ఒకింత ఊరట లభించనుంది.