Sunday, April 28, 2024

కరోనా రోగులు పశువులకన్నా హీనమా?

- Advertisement -
- Advertisement -

Supreme Court outrage over conditions in Delhi Hospitals

 

ఢిల్లీ ఆస్పత్రుల్లో పరిస్థితులపై సుప్రీంకోర్టు ఆగ్రహం
టెస్టులు ఎందుకు తగ్గించారని ప్రశ్న
కేంద్రం సహా రాష్ట్రాలకు నోటీసులు

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ సహా పలు నగరాల్లో పరిస్థితులు భయానకంగా ఉన్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కరోనా రోగులకు చికిత్స, కరోనా మృతులకు అంత్యక్రియల నిర్వహణ తీరుపై సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా విచారణ జరిపింది. ఢిల్లీలో కరోనా రోగులపట్ల జంతువులకన్నా దారుణంగా వ్యవహరిస్తున్నారని.. ఆస్పత్రుల్లో మృతదేహాల నిర్వహణ సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. చెత్తకుప్పలో మృతదేహాలు కనిపించడం వంటి దృశ్యాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని న్యాయమూర్తి జస్టిస్ కౌల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రుల్లో కరోనా మృతదేహాలను ఉంచడంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం లేదని న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో కరోనా పరీక్షల శాతం ఎందుకు తగ్గిందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. తొలుత కరోనా పరీక్షల్లో అగ్రస్థానంలో ఉన్న ఢిల్లీ తర్వాత ఎందుకు పడిపోయిందని ప్రశ్నించింది. గతంలో రోజుకు 7 వేల పరీక్షలు చేస్తే ఇప్పుడు 5 వేలే చేస్తున్నారని తెలిపింది.

చెన్నై, ముంబయి నగరాల్లో రోజుకు 16 వేలనుంచి 17 వేలకు పరీక్షలసంఖ్య పెరిగందని పేర్కొంది. కరోనా రోగులు ఆస్పత్రుల్లో పడకలు లేక ఇబ్బందులు పడుతున్నారని మీడియాలో కథనాలు వస్తుంటే ప్రభుత్వాలు మాత్రం పడకలు ఖాళీగా ఉన్నాయని చెబుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా పరీక్షల సంఖ్యను పెంచాలని రాష్ట్రాలను ఆదేశిస్తామని తెలిపింది. కరోనాతో చనిపోతే వారి బంధువులకు కూడా సమాచారం ఇవ్వడం లేదన్న మీడియాలో కథనాలను చూస్తేనే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుందని న్యాయమూర్తులు అశోక్ భూషణ్, ఎస్‌కె కౌల్, ఎంఆర్ షాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో పరిస్థితులు భయానకంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై సమాధానం చెప్పాలంటూ కేంద్రంతో పాటుగా ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News