లెఫ్టెనెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు స్వీకరించిన తెలంగాణ గవర్నర్ తమిళిసై
పుదుచ్చేరి: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో మైనారిటీలో పడిన వి.నారాయణస్వామి ప్రభుత్వాన్ని బలనిరూపణ చేసుకోవాల్సిందిగా లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశించారు. బలపరీక్ష కో సం ఈ నెల 22న సాయంత్రం 5 గంటల కు అ సెంబ్లీని సమావేశపరచాలని ఆమె ఆ దేశించారు. ఎల్జిగా అదనపు బాధ్యతలు చేపట్టి న కొన్ని గంటల్లోనే తమిళిసై ఈ ఆదేశాలిచ్చారు. గత జనవరి నుంచి కాంగ్రెస్కు చెందిన నలుగురు ఎంఎల్ఎల రాజీనామాతో నారాయణస్వామి ప్రభుత్వం మైనార్టీలో పడింది.పుదుచ్చేరి అసెంబ్లీలో మొత్తం 33 స్థానాలుండగా, కాంగ్రెస్,డిఎంకె, స్వతంత్ర అభ్యర్థితో కూడిన కూటమి 18మంది సభ్యుల బలంతో కాంగ్రెస్ నేత నారాయణస్వామి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
జనవరిలో ఎంఎల్ఎలు ఎ.నమఃశివాయం, తీప్పాయింజన్ రాజీనామా చేసి బిజెపిలో చేరారు. తాజాగా కాంగ్రెస్ ఎంఎల్ఎలు మల్లాడి కృష్ణారావు, ఎ.జాన్కుమార్ రాజీనామాలు చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ తమ ఎంఎల్ఎ ధనవేలుపై కాంగ్రెస్ వేటు వేయడంతో ఆయన ఓటు హక్కు కోల్పోయారు. దీంతో, ప్రస్తుతం కాంగ్రెస్ కూటమి బలం 14కు చేరింది. స్పీకర్తో కలిపి కాంగ్రెస్ సభ్యులు 10మంది కాగా, డిఎంకె సభ్యులు ముగ్గురు, ఒక స్వతంత్ర అభ్యర్థి ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారు. మరోవైపు ఎఐఎన్ఆర్ కాంగ్రెస్ సభ్యులు ఏడుగురు, ఎఐఎడిఎంకె సభ్యులు నలుగురు, బిజెపి సభ్యులు ముగ్గురితో కూడిన కూటమి బలం కూడా 14 కావడంతో ప్రతిష్టంభన నెలకొన్నది. ప్రస్తుతం 28మంది ఉన్న అసెంబ్లీలో మెజారిటీ నిరూపణకు 15మంది సభ్యుల బలం ఉండాలి.