చెన్నై: సెల్ ఫోన్ పేలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన తమిళనాడు కరూర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… సెల్ఫోన్ ఛార్జింగ్ పెట్టి ముత్తులక్ష్మీ అనే మహిళ ఇద్దరు పిల్లలతో కలిసి నిద్రలోకి జారుకుంది. అయితే ప్రమాదవశాత్తు ఆ సెల్ ఫోన్ పేలడంతో ఇంట్లో భారీ మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు.
అప్పటికే ఇంట్లో మంటలు వ్యాప్తి చెందడటంతో తల్లితో పాటు పిల్లలు రంజిత్, దక్షిత్ ప్రాణాలు విడిచారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. సెల్ఫోన్లను వినియోగించే విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి, లేకపోతే అవే ప్రమాదాలు తెచ్చిపెడుతుంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురు దుర్మరణం పాలవడంతో స్థానికంగా విషాద ఛాయాలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరు పెడుతున్నారు.