హైదరాబాద్ : కరోనా ప్రభావంతో తెలంగాణ, ఏపి ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించిన దరిమిలా అదే అదనుగా భావించి ప్రైవేటు అంబులెన్సుల యజమానులు, డ్రైవర్లు నయా దందాకు తెరలేపారు. కరోనా నిబంధనలు అమల్లో ఉన్నా పట్టించుకోకుండా అక్రమరవాణా సాగి స్తున్నారు. హైదరాబాద్-విజయవాడ మధ్య ప్రైవేటు అంబులెన్సుల్లో ప్రయాణీకలను అక్రమరవాణా చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రభుత్వ నిబంధనలకు తిలోదకాలిస్తున్నారు. అంబులెన్స్ల్లో రోగులు ఉంటారన్న కారణంగా పోలీసులు వారిని విడిచిపెడుతుండటమే దీనికి కారణంగా తెలుస్తోంది. అంబులెన్స్ల్లో ప్రయాణీకులను ఎక్కించి సూర్యాపేట, కోదాడ మీదుగా విజయవాడ తరలిస్తున్నారు.
అందుకు ఒక్కొక్కరి వద్ద నుంచి వెయ్యి నుంచి రెండు వేల రూపాయలకు పైగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రయాణీకులను రోగులుగా నమ్మించేందుకు ముఖాలకు మాస్కులు కట్టి మరీ అక్రమంగా వాహనాలు నడుపుతున్నారు. పేషెంట్ల ముసుగులో ప్రయాణీకులను తరలిస్తూ వేలాది రూపాయలు దోచుకుంటున్నారు. ఈ దందా గురించి తెలుసుకుని పోలీసులు షాక్ తిన్నారు. ఇకపై అంబులెన్స్లు కూడా చెక్ చెయ్యాల్సిన పరిస్థితేర్పడింది. కోదాడ దగ్గర ఏర్పాటు చేసిన పోలీస్ చెక్పోస్టులో ఈ దందా వెలుగుచూసింది. ఈ ఘటనతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు. ఇకపై హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో హైవే రోడ్లపై చెకింగ్ చేయాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది తెలిసిన వారంతా క్యాబాత్ హై అని నోళ్లు వెల్లబెడుతున్నారు. ఇదిలా ఉండగా, అంబులెన్స్ల్లో జనాలను తరలించిన ఘటన తమ దృష్టికి వచ్చిందని, అలా చేసిన పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ సిపి సజ్జనార్ చెప్పారు.