సెంచరీ ఖాయమంటున్న నేతలు
పోలింగ్ సరళి పరిశీలనకు పార్టీ కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు
డివిజన్ల వారీగా సమీక్ష జరుపుతున్న నాయకత్వం
చేసిన విశేష ప్రచారంతో పోలింగ్ శాతం పెరగగలదని ఆశాభావం
మనతెలంగాణ/హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పోలింగ్లో టిఆర్ఎస్కు అత్యధికంగా ఓట్లు పడతాయనే నమ్మకంలో టిఆర్ఎస్ పార్టీఉంది. గత గ్రేటర్ ఎన్నికల్లో 99 స్థానాలు సొంతం చేసుకున్న టిఆర్ఎస్ ప్రస్తుతం సెంచరీ కొట్టేందుకు ఓటర్లు తీర్పు ఇస్తారనే ధీమా నాయకుల్లో వ్యక్తం అవుతుంది. గత 15 రోజులపాటు గ్రేటర్ హైదరాబాద్లో ఓటర్లందరిని కలిసి పార్టీ విధానాలు, భవిష్యత్ కార్యాచరణ టిఆర్ఎస్ వివరించ గలిగింది. టిఆర్ఎస్ ముఖ్య నాయకులంతాఎన్నికల ప్రచారంలో నిగ్నమై ప్రజందరిని కలువగలిగారు. 150 డివిజన్లలో ప్రణాళికాబద్దంగా ప్రచారం నిర్వహించిన టిఆర్ఎస్ గెలుపుపై ఆశలు పెంచుకుంది. ప్రచారం ముగిసిన అనంతరం టిఆర్ఎస్ డివిజన్ల వారిగా విశ్లేషణలు, నాయకుల అభిప్రాయాలు, ఓటర్ల నాడిని పట్టుకున్న అనంతరం తప్పనిసరిగా గ్రేటర్ పీఠంపై మహిళా అభ్యర్థిని కూర్చొపెడతామనే ధీమాలో టిఆర్ఎస్ ఉంది. టిఆర్ఎస్కు హైదరాబాద్లో సుమారు 16 లక్షల పార్టీశ్రేణులు, నాయకులు ఉండటంతో టిఆర్ఎస్ విధానాలను వేగవంతంగా ప్రజలకు చేర్చడంతో పాటుగా విపక్షాల విమర్శలను, విధానాలను తిప్పిగొట్టగలిగామనే నమ్మకంలో టిఆర్ఎస్ అధిష్టానం ఉంది.
పోలింగ్ సరళిని అంచనా వేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు
సోమవారం జరగనున్న గ్రేటర్ఎన్నికల పోలింగ్ సరళిని అంచనావేసేందుకు టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేశారు. హైదరాబాద్కు చెందిన ముఖ్యనాయకులు 150 డివిజన్లలో జరిగే ప్రక్రియను ఎప్పటికప్పుడు విశ్లేషించేందకు పార్టీ అధిష్టానం అందుబాటులో ఉంచింది. అలాగే ప్రతిపక్షాలు ఇబ్బందులు సృష్టిస్తే ఎన్నికల కమిషన్కు ఎప్పటికప్పుడు ఫిర్యాదులు చేసేందుకు కొంత మంది టిఆర్ఎస్ నాయకులకు బాధ్యతలు అప్పగించింది. అయితే దాదాపుగా సిట్టింగ్లకే తిరిగి అవకాశాలు రావడంతో ప్రజల్లో చెక్కుచెదరని అభిమానంతో విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయని టిఆర్ఎస్ అంచనా వేసింది.
నివేదికలును పరిశీలిస్తున్న టిఆర్ఎస్
ఎన్నికల ప్రచారం ముగిసి పోలింగ్కు సిద్దం కావడంతో డివిజన్లలోని రాజకీయపరిస్థితులను టిఆర్ఎస్ అధిష్టానం సమీక్షిస్తుంది. డివిజన్లవారిగా అభ్యర్థులకు ఏ మేరకు ఓట్లు పోల్కానున్నాయి. డివిజన్ల రాజకీయ పరిస్థితులను విశ్లేషణ చేస్తున్నారు. అయితే డివిజన్లవారిగా టిఆర్ఎస్ అధిష్టానం నివేదకలను పరిశీలించి సెంచరీ కొట్టడం ఖాయమనే తలంపులో ఉంది. గ్రేటర్ ఎన్నికల్లో మహిళలకు 75 సీట్లు ఇవ్వాల్సి ఉండగా టిఆర్ఎస్ 85 మంది మహిళా అభ్యర్థులను పోటీలో నిలిపింది. గెలిచే అభ్యర్థుల నుంచి మహిళను కార్పొరేటర్గా ఎంపిక చేయాలని టిఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించింది. పోలీంగ్బూత్లకు 150 మంది పార్టీ ప్రతినిధులను ఏజెంట్లుగా టిఆర్ఎస్ నియమించింది. పోలింగ్ అనంతరం ఏజెంట్లతో టిఆర్ఎస్ నాయకులు సమావేశాలు చేసి గెలిచే అవకాశాలను విశ్లేషించనున్నారు. ఎన్నికల నింబంధనలు తప్పనిసరిగా పాటించాలని, విపక్షాలు రెచ్చగొట్టే ధోరణీలో ఉన్నా ఆవేశపడవద్దని టిఆర్ఎస్ అధిష్టానం ఇప్పటికే నాయకులకు సూచనలు చేసింది. పోలింగ్ బూత్ల దగ్గర విపక్షాలు అవేశపూరితంగా వ్యవహిరిస్తే టిఆర్ఎస్ శ్రేణులు సంయనం పాటించి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయాలని టిఆర్ఎస్ నాయకులకు ఆదేశాలు జారీ చేసింది.
పెరగనున్న పోలింగ్ శాతం
ఓటు ప్రధాన్యతను ప్రజలకు వివరిస్తూ టిఆర్ఎస్ చేసిన ఎన్నికల ప్రరచారం ప్రభావం ఉంటుందని పలువురు భావిస్తున్నారు. గత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో 45 శాతానికి మించి ఓట్లు నమోదు కాలేదు. ప్రస్తుతం ఒకవైపు ఎన్నికల కమిషన్ ఓటు ప్రధాన్యతను వివరిస్తూ చేసిన ప్రచారం, టిఆర్ఎస్ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలను కోరిన విధానాలతో ప్రస్తుత ఎన్నికల్లో ఓట్ల శాతం పెరిగే అవకాశం ఉందని టిఆర్ఎస్ భావిస్తుంది. 2016లో 45.27 శాతం ఓట్లు నమోదు అయ్యాయి. ప్రధానంగా విద్యావంతులు, ఐటి,ప్రభుత్వ,ప్రైవేటు ఉద్యోగులు అధికశాతం పోలింగ్కు దూరం ఉంటున్నారు. ప్రస్తుతం ఈ వర్గాలను ప్రభావితం చేస్తూ వివిధ రాజకీయ పార్టీలు ప్రచార కార్యక్రమాలు చేపట్టడంతో పాటుగా ఎన్నికల కమిషన్ కూడా ఓటు ప్రాధాన్యతను విస్తృతంగా ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగే అవకాశాలున్నట్లు టిఆర్ఎస్ అంచనా వేస్తుంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్లో 74,44,260 మంది ఓటర్లు ఉండగా ఇందులో పురుషులు 35,76,941 మంది, మహిళలు 38,89,637 మంది ఉండగా మూడవ వర్గం 678 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్లలో అత్యధికంగా తమపార్టీ శ్రేణులు ఉన్నట్లు టిఆర్ఎస్ భావిస్తుంది. డివిజన్ల వారిగా విశ్లేషణచేసిన టిఆర్ఎస్ ఓట్ల శాతం పెరగడంతో పాటుగా 100స్థానాలు సునాయసంగా టిఆర్ఎస్ కైవసం చేసుకుంటుందనే నమ్మకంలో ఉంది.