Sunday, April 28, 2024

భగ్గుమన్న ఎర్రసముద్రం

- Advertisement -
- Advertisement -

లండన్: గత కొన్ని నెలలుగా ఎర్రసముద్రం ప్రాంతంలో వాణిజ్య నౌకలపై హౌతీ తిరుగుబాటుదారులు వరస దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇజ్రాయెల్‌కు చెందిన నౌకలు, ఆక్రమిత పాలస్తీనా వైపు వెళుతున్న నౌకలను లక్షంగా చేసుకుని ఇరాన్ అనుకూల హౌతీ తిరుగుబాటుదారులు దాడులు చేస్తున్నారు. దీంతో హౌతీ తిరుగుబాటుదారులను చావుదెబ్బ తీసేందుకు అమెరికా, బ్రిటన్ సంకీర్ణ దళాలు గురువారం యెమెన్‌లో16 ప్రాంతాల్లోని 60 లక్షాలపై దాడులు చేశాయి. వీటిలో హౌతీ కమాండ్ సెంటర్లు, ఆయుధ డిపోలు, లాంచింగ్ వాహనాలు, ఉత్పత్తి కేంద్రాలు, ఎయిర్ డిఫెన్స్ రాడార్ వ్యవస్థు ఉన్నాయని అమెరికా వాయుసేన తెలిపింది. ఈ దాడుల కోసం 100 గైడెడ్ ఆయుధాలు ఉపయోగించారు. ‘ఇరాన్ అండతో రెచ్చిపోతున్న సాయుధ గ్రూపులనుంచి మధ్యప్రాచ్యంలోని మిత్రులను రక్షించడానికి మేము కట్టుబడి ఉన్నాం. ప్రాంతీయ భద్రత, స్థిరత్వానికి హౌతీలు ముప్పుగా మారారు’

అని గగనతలం, సముద్రం మీదినుంచి జరిపిన ఈ దాడులగురించి మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. అవసరమయితే మరిన్ని దాడులు జరుపుతామని కూడా ఆయన హెచ్చరించారు. యెమెన్‌లోని హౌతీ స్థావరాలపైనే తాము దాడులు చేసినట్లు అమెరికా రక్షణ శాఖ ప్రతినిధి లెఫ్టెనెంట్ జనరల్ అలెక్స్ గ్రెంక్విచ్ తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున కూడా యెమెన్‌లో పేలుళ్లు వినిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాగా ప్రస్తుతానికి హౌతీ టార్గెట్లపై మరిన్ని దాడులు జరిపే ఆలోచన లేదని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కార్యాలయం తెలిపింది. అయితే పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉంటామని తెలిపింది.ఈ దాడులు అవసరమని సునాక్ అభిప్రాయపడ్డారు. సంకీర్ణ కూటమి కూడా ఈ దాడులపై స్పందించింది. ఆస్ట్రేలియా, బహ్రెయిన్, కెనడా, డెన్మార్క్, జర్మనీ, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, దక్షిణ కొరియా, యుకె, అమెరికా దేశాలు సంయుక్త ప్రకటన చేశాయి. అంతర్జాతీయ నౌకామార్గంపై దాడులు చేసే సామర్థాన్ని అంతం చేయాలనే ఉద్దేశంతోనే నిర్ణీత లక్షాలను పేల్చేశామని తెలిపాయి. ఎర్ర సముద్రంలో శాంతిని నెలకొల్పడమే తమ ఉద్దేశమని పేర్కొన్నాయి.

ఇజ్రాయెల్ నౌకలపై దాడులు ఆగవు: హౌతీ
కాగా యెమెన్‌పై చేసిన దాడులు మూర్ఖపు చర్యగా అమెరికా, బ్రిటన్‌లు త్వరలోనే తెలుసుకుంటాయని హౌతీ నాయకుడు మహమ్మద్ అల్‌బుఖాతి పేర్కొన్నారు.‘ యెమెన్‌పై యుద్ధం మొదలుపెట్టి అమెరికా, బ్రిటన్‌లు పెద్ద తప్పు చేశాయి. గత అనుభవాలనుంచి వారు ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదు.ప్రపంచంలోని ప్రతి ఒక్కరి ఎదుట రెండు అప్షన్లు ఉంటాయి.నరమేధం జరిపే వారి పక్షాన నిలవొచ్చు. లేదా బాధితులవైపు ఉండొచ్చు’ అని ఆయన ‘ఎక్స్’లోచేసిన ట్వీట్‌లో వెల్లడించారు. కాగా యెమెన్‌లోని అయిదు ప్రాంతాల్లో 73 దాడులు జరిగాయని, ఈ దాడుల్లో అయిదుగురు చనిపోగా, ఆరుగురు గాయపడినట్లు హౌతీ మిలిటరీ ప్రతినిధి యాహ్యా సారీ తెలిపారు.

మా యెమెన్ పౌరులపై జరిపిన దాడులకు అమెరికా, బ్రిటన్ శత్రువులే పూర్తి బాధ్యత వహించాలి. దీనికి ప్రతీకారం తీర్చుకోకుండా ఉండము’ అని ఆయన హెచ్చరించారు. హౌతీ మంత్రి హుస్సేన్ అల్ ఎజ్జి మాట్లాడుతూ ఇజ్రాయెల్ నౌకలపై దాడులు ఏమాత్రం ఆగవని స్పష్టం చేశారు. అమెరికా, బ్రిటన్ తీవ్రపరిణామాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.కాగా ఈ దాడులపై ససౌదీ అరేబియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. యెమెన్‌పై దాడులపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో చర్చించాలని రష్యా అభిప్రాయపడింది. మరో వైపు ఈ దాడులు అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాగా ఇజ్రాయెల్‌పాలస్తీనా మధ్య దాడులు మొదలైన తర్వాత ఇప్పటివరకు 27 నౌకలపై హౌతీలు దాడి చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News