అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకుంటాం
సిఎల్పి భేటీ అనంతరం కమల్నాథ్ ధీమా
రహస్య ప్రదేశానికి బిజెపి సభ్యుల తరలింపు
భోపాల్: జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందిన 22 మంది కాంగ్రెస్ ఎంఎల్ఎలు రాజీనామా చేసినప్పటికీ తన ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని, తాము అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకుంటామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్ దీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సీనియన్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా పార్టీకి రాజీనామా చేయడం, ఆయన వర్గానికి చెందిన 22 మంది ఎంఎల్ఎలు పార్టీకి రాజీనామా చేయడంతో మధ్యప్రదేశ్లో కమల్నాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం కుప్పకూలే పరిస్థితి ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం కమల్నాథ్ అధ్యక్షతన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ అత్యవసరంగా సమావేశమైంది. సింధియా వ్యక్తిగత ఆశలను నెరవేర్చడం ద్వారా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చడానికి బిజెపి చేస్తున్న ప్రయత్నాలను ఈ సమావేశం ఖండించింది. అలాగే వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాంగ్రస్ పార్టీని వీడి బిజెపిలో చేరడానికి సిద్ధమైన జ్యోతిరాదిత్య సింధియాను పార్టీనుంచి బహిష్కరించినందుకు పార్టీ అధిష్ఠాన వర్గానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సమావేశం ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది.
ఈ సమావేశానికి నలుగురు స్వతంత్రులతో పాటుగా దాదాపు 100 మంది ఎంఎల్ఎలు హాజరైనట్లు సమావేశం అనంతరం రాష్ట్ర మంత్రి ఒకరు తెలిపారు. వారంతా కమల్నాథ్ నాయకత్వం విశ్వాసం వ్యక్తం చేసినట్లు చెప్పారు. అయితే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న ఇద్దరు బిఎస్పి, ఒక ఎస్పి ఎంఎల్ఎలు మాత్రం ఈ భేటీకి రాలేదని ఆయన చెప్పారు. ఈ ముగ్గురు హర్యానాలోని ఒక హోటల్లోలో చిక్కుపడి ఉన్నట్లు తెలుస్తోందని తెలుస్తోంది. గతవారం బిజెపి కొంత మంది కాంగ్రెస్ ఎంఎల్ఎలను ప్రలోభపెట్టి రహస్య ప్రదేశానికి తీసుకెళ్లినట్లు కాంగ్రెస్ ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే రాజీనామా చేసినట్లు చెబుతున్న 22 మంది ఎంఎల్ఎలలో ఎవరు కూడా ఈ భేటీకి హాజరు కాలేదు.228మంది సభ్యులున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్కు 114 మంది సభ్యులున్న విషయం తెలిసిందే. కాగా రాజీనామా చేసిన ఎంఎల్ఎలు ఇప్పటికీ సిఎంతో టచ్లో ఉన్నారని మరో మంత్రి పిసి శర్మ చెప్పారు. రాజ్యసభకు సింధియా అభ్యర్థిత్వానికి మద్దతు కోసమని చెప్పి వారినందరినీ రాష్ట్రం వెలుపలకు తీసుకెళ్లడం జరిగిందని ఆయన చెప్పారు. సింధియా బిజెపితో బేరసారాలు చేయడం పట్ల వారు సంతోషంగా లేరని కూడా ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా తమ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తమ ఎంఎల్ఎలతో ఎక్కడ బేరసారాలు సాగిస్తుదోనన్న భయంతో బిజెపి తమ ఎంఎల్ఎలనందరినీ రాష్ట్రం వెలుపల రహస్య ప్రదేశానికి తరలించింది. బిజెపి రాష్ట్ర కార్యాలయం వద్ద పార్కు చేసిన బసుల్లో ఎక్కిన ఈ ఎంఎల్ఎలంతా బెంగళూరుకో, ఢిల్లీకో వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
We will prove Our Majority in Assembly: Kamalanath