హైదరాబాద్: కరోనా లాక్డౌన్ కారణంగా సినిమా ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. షూటింగ్ పూర్తయిన సినిమాలు విడుదల కాకపోవడం, కొత్త సినిమాల షూటింగ్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే పరిస్థితులన్నీ చక్కబడుతూ తిరిగి షూటింగ్లు ప్రారంభమవుతున్నాయి. థియేటర్లు కూడా త్వరలో తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికాల తగ్గింపుపై ఒప్పందం కుదిరింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్తో ఈ ఒప్పందం కుదిరినట్లు యాక్టివ్ తెలుగు సినిమా నిర్మాతల గిల్డ్ పేర్కొంది. లాక్డౌన్కు ముందున్న పారితోషికాల్లో 20 శాతం తగ్గింపునకు ఒప్పందం చేసుకున్నట్లు స్పష్టంచేసింది. సినిమాకు రూ.5 లక్షలు మించి తీసుకునేవారి పారితోషికాల్లో 20 శాతం తగ్గింపు ఉంటుందని ప్రకటించింది. రోజుకు రూ.20వేలకు మించి తీసుకునేవారి పారితోషికాల్లోనూ తగ్గింపు ఉన్నట్లు వెల్లడించింది. రోజుకు రూ.20 వేలలోపు తీసుకునే వారి పారితోషికాలు యథాతథంగా ఉండనున్నట్లు తెలిపింది.
20% Cut in Remuneration of Telugu actors and Technicians