సంగారెడ్డి: హైదరాబాద్లో టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే జిహెచ్ఎంసి ఎన్నికల్లో ప్రచారాస్త్రాలు అని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. భారతీనగర్ డివిజన్లో జరిగిన టిఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో హరీష్ మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడమే బిజెపి పనిగా పెట్టుకుందని విమర్శించారు. ప్రైవేటీకరణ కారణంగా లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారని తెలియజేశారు. బిఎస్ఎన్ఎల్, రైల్వేలు, ఎయిర్ ఇండియా, బిపిసిఎల్, ఒఎన్జి వంటి సంస్థలను బిజెపి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. ప్రతిష్టాత్మకమైన బిహెచ్ఇఎల్ మూతపడే పరిస్థితి వచ్చిందని, తెలంగాణ ప్రభుత్వం రూ.30 వేల కోట్ల యాదాద్రి పవర్ ప్రాజెక్టు పనులను బిహెచ్ఇఎల్కు అప్పగించిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 148 మెగావాట్ల పంప్ పనులను అప్పగించిందన్నారు. బిహెచ్ఇఎల్కు వివిధ రాష్ట్రాలు, మోడీ ప్రభుత్వం ఎందుకు పనులు అప్పగించలేదని ప్రశ్నించారు. బిజెపి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు టిఆర్ఎస్ కార్యకర్తలు చెప్పాలన్నారు. ఈ సమావేశంలో మంత్రి హరీష్ రావు, ఎంఎల్ఎ క్రాంతికిరణ్, ఎంఎల్సి భూపాల్ రెడ్డి పాల్గొన్నారు.