హైదరాబాద్ : తెలుగు చిత్ర పరిశ్రమకు ఎలాంటి సాయం కావాలన్నా చేయడానికి సిఎం కెసిఆర్ సిద్ధంగా ఉన్నారని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. పార్క్హయత్ హోటల్లో గురువారం జరిగిన మూవీ ఆర్టీస్ట్ అసోసియేషన్ (మా) డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కృష్ణంరాజు, మోహన్బాబులతో కలిసి డైరీని ఆవిష్కరించారు. అనంతరం మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ చిత్రపరిశ్రమకు సహాయ, సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నానని గతంలో కెసిఆర్ ప్రకటించారని, ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమకు సంబంధించి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావాలో చర్చించి నిర్ణయం తీసుకొని సిఎం దృష్టికి తీసుకెళదామన్నారు. ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని వివరాలు డైరీలో పొందుపరిచినట్టు ఆయన తెలిపారు. ఈ ఏడాది రెండు లేదా మూడు ఈవెంట్స్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, నాగార్జున, ప్రభాస్, పవన్కళ్యాణ్, బాలకృష్ణలతో పాటు ఇతర కథనాయకులను దీనిలో భాగస్వాములు కావాలని కోరతామన్నారు.