Monday, April 29, 2024

ప్లీజ్ బీ అలర్ట్

- Advertisement -
- Advertisement -

CM KCR

 

రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి ఎక్కువవుతోంది
గణనీయ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి
అనుమానమొస్తే కరోనా పరీక్షలు చేయించుకోండి
బయటకు వెళ్లాల్సివస్తే భౌతిక దూరం పాటించడం మంచిది
ప్రజలు, అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలి
అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో విస్తృత తనిఖీలు: సిఎం కెసిఆర్ పిలుపు

కొత్తగా 28 మందికి వైరస్

ఇద్దరు మృతి.. ఏడుగురు డిశ్చార్జి

మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలోనూ, రాష్ట్రంలోనూ కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువ అవుతున్నందున ప్రజలు మరింత జాగ్రత్తగా, అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కోరారు. తెలంగాణలో ఆదివారం కొత్తగా 28 మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలిందని, ఇద్దరు చనిపోయారని, చికిత్స పొందుతున్న వారిలో ఏడుగురు కోలుకుని డిశ్చార్జి అయ్యారని వెల్లడించారు. దీంతో తెలంగాణలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 531కి చేరిందని, మరణించిన వారి సంఖ్య 16కు పెరిగిందని, డిశ్చార్జి అయిన వారి సంఖ్య 103కి చేరిందన్నారు. మిగతా 412 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సిఎం చెప్పారు. కరోనా వ్యాప్తి నివారణకు చేపడుతున్న చర్యలు, వైరస్ సోకిన వారికి అందుతున్న చికిత్స, లాక్ డౌన్ అమలవుతున్న తీరు, పేదలకు అందుతున్నసాయం, పంటల కొనుగోళ్లు జరుగుతున్న విధానాలపై ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

మద్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి 9.30 వరకు సాగిన సమీక్షలో రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితిపై చర్చించారు. “ప్రపంచ వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా, తెలంగాణలో పరిణామాలు గమనిస్తుంటే కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదని స్పష్టం అవుతుందన్నారు. ఆదివారం కూడా గణనీయ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, రాష్ట్రంలో కొత్తగా 28కి పాజిటివ్ అని తేలడంతో పాటు ఇద్దరు చనిపోయినట్లు తెలిపారు. పక్కనే ఉన్న మహారాష్ట్ర లో పరిస్థితి భయంకరంగా ఉందని, దేశ వ్యాప్తంగా కూడా పాజిటివ్ కేసులు, మరణాలు పెరిగాయని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితి ఉన్నందునే లాక్ డౌన్ పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. పరిస్థితి తీవ్రతను ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. వీలైనంత వరకు ఇళ్లకే పరిమితం కావాలని విజ్ఞప్తి చేశారు. బయటకు వెళ్లాల్సి వస్తే తప్పక సామాజిక దూరం పాటించాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యమని, ఎవరికి ఏ మాత్రం అనుమానం వచ్చినా పరీక్షలు చేయించుకోవాలన్నారు.

కరోనా వైరస్ సోకిన వ్యక్తులున్న ప్రాంతాలను గుర్తించి, ప్రభుత్వం అక్కడ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, ప్రజలు దానికి సహకరించాలని కోరారు. కరోనా వ్యాప్తి నివారణ అన్నది కేవలం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల మాత్రమే సాధ్యం కాదని, ఆ నిర్ణయాలను ప్రజలు తు.చ. తప్పకుండా పాటించడం వల్ల మాత్రమే సాధ్యమవుతుందన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి జరుగుతున్నదనే వాస్తవం గ్రహించి, ప్రజలు ఇంతకుముందు కంటే కూడా మరింత జాగ్రత్తగా ఉండాలి” అని ముఖ్యమంత్రి కోరారు. అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాలని, ఎవరికి లక్షణాలు కన్పించినా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. పాజిటివ్ వచ్చిన వారు ఎవరెవరిని కలిశారు? ఎక్కడ తిరిగారు? అనే వివరాలు సేకరించి, వారికీ పరీక్షలు నిర్వహించాలన్నారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద తనిఖీలు ఎక్కువ చేయాలని, నియంత్రణ పెంచాలన్నారు.

మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారిని గుర్తించి, పరీక్షలు చేసే పని ముమ్మరంగా జరుగుతున్నదని, ఇంకా ఎవరైనా తెలిసో తెలియకో పరీక్షలు చేయించుకోకుంటే వారే స్వయంగా వచ్చి పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఇది వారి కోసం, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం చెబుతున్న మాటలు. ప్రజల నిరంతర అప్రమత్తత, ఇళ్లల్లకే పరిమితం కావడంపైనే కరోనా వ్యాప్తి నివారణ సాధ్యం అవుతుంది” అని ముఖ్యమంత్రి అన్నారు. ఈ సమీక్షలో ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్ రావు, రామకృష్ణ రావు, జనార్థన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

CM KCR review on coronavirus
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News