ప్రత్యేక వాహనం తయారు చేయిస్తున్న వైద్యారోగ్య శాఖ
ఇంటి వద్దనే అనుమానితుల శాంపిళ్ల సేకరణ!
హైదరాబాద్ : కరోనా అనుమానితుల శాంపిళ్లను ఇంటి దగ్గరే సేకరించే విషయమై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఆ తరువాత శాంపిళ్లను పరీక్షలకు పంపనున్నారు. శాంపిళ్ల సేకరణకు వైద్యారోగ్యశాఖ ప్రత్యేకంగా ఓ వాహనాన్ని తయారు చేయిస్తోంది. తొలుత హైదరాబాద్లో ఈ వాహన సేవలు ప్రారంభించనున్నారు. అనుమానితులందరినీ ఒకే దగ్గర ఉంచితే, వాళ్లలో ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకే ప్రమాదం ఉంది. అలాగే టెస్ట్ రిపోర్టులు లేట్ అవుతుండటంతో ఐసోలేషన్లో ఉన్న అనుమానితులు అసహనానికి లోనవుతున్నారు. దీనిపై వైద్యారోగ్యశాఖ అధికారులకు ఫిర్యాదులు అందాయి.
వీటికి పరిష్కారంగా ఇంటి వద్దే సాంపిల్స్ సేకరించడం వల్ల ఇలాంటి సమస్యలను అధిగమించొచ్చని భావిస్తున్నారు. కంటైన్మెంట్ జోన్లలో పెద్దఎత్తున సాంపి ల్స్ సేకరించాల్సి వచ్చినా, ఈ విదానం ఉపయోగకరంగా ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు మన తెలంగాణకు చెప్పారు. ఈ విధానంలో నేరుగా అనుమానితుడి ఇంటి వద్దకు వెళ్లి, అక్కడే శాంపిల్స్ సేకరిస్తారు. రిపోర్ట్ వచ్చే వరకు వారిని ఇంట్లోనే క్వారంటైన్ చేస్తారు. ఒకవేళ పాజిటివ్ వస్తే హాస్పిటల్కు తరలిస్తారు. ఇలా చేయడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ శాంపిల్స్ సేకరించడమే కాకుండా, ఎక్కువ మందిని క్వారంటైన్ సెంటర్లకు, దవాఖాన్లకు తరలించాల్సిన సమస్య కూడా రాదని పేర్కొంటున్నారు.