న్యూఢిల్లీ: నేడు దేశవ్యాప్తంగా రాస్తారోకోకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. కేంద్రం తీసుకువచ్చిన సాగు చట్టాల రద్దు ఉద్యమంలో భాగంగా ‘చక్కా జామ్’ పేరుతో రాస్తారోకోకు మధ్యాహ్నం 12గంటల నుంచి 3 గంటల వరకు రహదారులను దిగ్బంధనం చేయనున్నట్టు పిలుపునిచ్చారు రైతు సంఘాల నేతలు. జాతీయ, రాష్ట్ర రహదారులను దిగ్బంధనం చేయనున్నట్టు రైతు నేతలు తెలిపారు. చక్కా జామ్ విజయవంతం చేసేందుకు కర్షక సంఘాలు అన్ని ఏర్పాట్లు చేశాయి. చక్కా జామ్ ను పూర్తి శాంతియుతంగా నిర్వహిస్తామని రైతుల సంఘాలు చెబుతున్నాయి. చక్కా జామ్ ముగియగానే నిమిషం పాటు హారన్ మోగించాలని రైతులు పేర్కొన్నారు. అయితే అంబులెన్స్, పాఠశాల బస్సులకు ఆటంకం కలిగించబోమని రైతన్నలు వెల్లడించారు. రైతు సంఘాల చక్కా జామ్ కు కాంగ్రెస్ మద్దతు ప్రకటిస్తుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి వేణుగోపాల్ తెలిపారు. మరోపక్క కీలక ప్రాంతాల్లో పక్కాగా భద్రతా ఏర్పాట్లకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఎర్రకోట తరహా ఘటనలు మళ్లీ జరగకుండా 3 ఆందోళన ప్రాంతాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. రోడ్డలకు అడ్డంగా బారికేడ్లు, ఇనుప చుట్ట తీగలను ఏర్పాటు చేశారు.