రాహుల్ ద్రవిడ్
బెంగళూరు: ఆస్ట్రేలియా గడ్డపై జరిగే సిరీస్లో టీమిండియా ఆశలన్నీ స్టార్ బ్యాట్స్మన్ చటేశ్వర్ పుజారాపైనే నిలిచాయని భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశాడు. కిందటిసారి ఆస్ట్రేలియా పర్యటనలో పుజారా పరుగుల వరద పారించడంలో వల్లే టీమిండియా చారిత్రక సిరీస్ను సొంతం చేసుకుందన్నాడు. ఆ సిరీస్లో పుజారా మూడు శతకాలతో పాటు 500కి పైగా పరుగులు సాధించిన విషయాన్ని ద్రవిడ్ గుర్తు చేశాడు. ఈసారి కూడా పుజారా జట్టుకు చాలా కీలకంగా మారాడన్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లి సిరీస్ మధ్యలోనే తప్పుకుంటుండడంతో పుజారా బాధ్యతలు మరింత పెరిగాయన్నాడు. కోహ్లి లేని సమయంలో కెప్టెన్గా వ్యవహరించే అజింక్య రహానెపై ఒత్తిడి ఉండడం సహాజమేనన్నాడు. ఇలాంటి స్థితిలో పుజారాపైనే జట్టు ఆశలు పెట్టుకుంటుందనడంలో సందేహం లేదన్నాడు.
ఫాస్ట్ బౌలింగ్కు సహకరించే ఆస్ట్రేలియా పిచ్లపై పుజారా, రహానెల పాత్ర చాలా కీలకమన్నాడు. రాహుల్, విహారి, పృథ్వీషా, శుభ్మన్ గిల్ తదితరులు కూడా తమవంతు పాత్ర పోషించాల్సిన అవసరం ఎంతైన ఉందన్నాడు. ఇక వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, రవిచంద్రన్ అశ్విన్లు కూడా బ్యాటింగ్ చేయగలవారే. దీంతో బ్యాటింగ్లో టీమిండియా బలంగానే ఉంది. అయితే నిలకడలేమి జట్టుకు ప్రధాన సమస్యగా మారే అవకాశం ఉందన్నాడు. సమష్టిగా రాణిసతే ఆస్ట్రేలియా గడ్డపై మరోసారి చరిత్ర సృష్టించడం భారత్కు కష్టమేమి కాదని ద్రవిడ్ స్పష్టం చేశాడు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో రాహుల్ ఈ విషయాలు వెల్లడించాడు.