మనతెలంగాణ/హైదరాబాద్:ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకోమన్నందుకు యువతిని హత్య చేసిన సంఘటన నగరంలోని పాతబస్తీ, రెయిన్బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదీనా నగర్లో చోటుచేసుకుంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం…నారాయణఖేడ్కు చెందిన యువతి రాధిక, పాబస్తీకి చెందిన ముస్తాఫా ఇద్దరు జంతు ప్రేమికులు. లా పరీక్షలు రాసేందుకు నగరంలోని ఆసిఫ్నగర్లో ఉంటున్న తన అన్న ఇంటికి వచ్చింది. ఓ రోజు జంతు ప్రదర్శనలో రెయిన్బజార్కు చెందిన సయ్యద్ మహ్మద్ ముస్తఫాతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమకు దారి తీసింది, కొద్ది రోజుల తర్వాత ముస్తాఫాకు ఫోన్ చేసినా స్పందించడం మానివేశాడు. ఈ క్రమంలోనే రాధిక శనివారం రాత్రి ప్రియుడు ముస్తాఫా ఇంటికి వెళ్లి తనను వివాహం చేసుకోవాలని నిలదీసింది. రాధిక కంటే ముస్తఫా 4 ఏళ్లు చిన్న వాడు కావడంతో వివాహం చేసేందుకు ముస్తాఫా కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీంతో ముస్తాఫా కుటుంబ సభ్యులకు, రాధికకు మధ్య పెద్ద గొడవ జరిగింది. అర్ధరాత్రి ముస్తాఫా, అతడి సోదరుడు జమీల్ కలిసి రాధికను కత్తితో పొడిచి చంపారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం బాధితురాలి గ్రామానికి పంపించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Girl killed in Old City due to love Affair