Monday, April 29, 2024

సింగరేణి బొగ్గుకు పెరుగుతున్న ఆదరణ

- Advertisement -
- Advertisement -
Growing popularity of Singareni coal
కోలిండియా నుంచి సింగరేణి బొగ్గుకు మారిన ఎన్‌టిపిసి
షోలాపూర్ ఎన్‌టిపిసి ప్లాంటుకు బొగ్గు సరఫరా చేయడానికి సింగరేణితో ఒప్పందం
ఏడాదికి 25 లక్షల 40 వేల టన్నుల సరఫరా

హైదరాబాద్: సింగరేణి బొగ్గుకు దేశ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. కోలిండియా నుంచి బొగ్గు స్వీకరిస్తున్న థర్మల్ విద్యుత్ కేంద్రాలు ప్రస్తుతం సింగరేణి వైపు మొగ్గు చూపుతున్నాయి. ఎన్‌టిపిసి సంస్థ మహారాష్ట్రలోని షోలాపూర్ వద్ద నిర్మించిన షోలాపూర్ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్‌లోని యూనిట్-1 కోసం సింగరేణి నుంచి బొగ్గు స్వీకరించడానికి ముందుకు వచ్చింది. అందులో భాగంగా సోమవారం హైదరాబాద్ సింగరేణి భవన్ లో ఈ మేరకు సింగరేణి, ఎన్‌టిపిసి ఉన్నతాధికారుల మధ్య ఇందన సరఫరా ఒప్పందం (ఫ్యూయల్ సప్లై అగ్రిమెంట్) జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం సింగరేణి సంస్థ షోలాపూర్ ప్లాంట్‌లోని ఒకటవ యూనిట్ కు ఏడాదికి 25 లక్షల 40 వేల టన్నుల బొగ్గు చొప్పున మరో 25 ఏళ్లపాటు బొగ్గు సరఫరా చేయనుంది.

కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ అనుమతితో….

వాస్తవానికి ఈ యూనిట్‌కు కోలిండియా నుంచి బొగ్గు స్వీకరించాల్సి ఉంది. కానీ ఎన్‌టిపిసి సంస్థ తాము సింగరేణి నుంచి బొగ్గు స్వీకరిస్తామని, అందుకు అనుమతించాలని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖను కోరింది. నాణ్యత, నిరంతరాయ సరఫరా, దూరం తదితర అంశాలలో సింగరేణి నుంచి బొగ్గు తీసుకోవడమే తమకు అనుకూలంగా, లాభదాయకంగా ఉంటుందని తెలపడంతో బొగ్గు మంత్రిత్వ శాఖ దీనికి అంగీకరించింది. బొగ్గు కేటాయింపుల కమిటీ సూచనపై సింగరేణి, ఎన్‌టిపిసిల మధ్య సోమవారం ఇంధన సరఫరా ఒప్పందం జరిగింది.

8 రాష్ట్రాల్లోని ఎన్‌టిపిసిలకు 135.30 లక్షల టన్నుల సరఫరా

సింగరేణి సంస్థ ఇప్పటికే 8 రాష్ట్రాల్లోని ఎన్‌టిపిసి థర్మల్ విద్యుత్ ప్లాంట్‌లకు బొగ్గు సరఫరా చేస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని ప్లాంట్‌లతో పాటు మహారాష్ట్ర, కర్నాటక, ఛత్తీస్‌ఘడ్, ఒడిస్సా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్లాంట్‌లకు ఏడాదికి 135.30 లక్షల టన్నుల బొగ్గును సింగరేణి అందిస్తోంది. దశాబ్దాల కాలంగా ఇరు సంస్థల మధ్య ఒప్పందాల మేరకు సజావుగా బొగ్గు సరఫరా సాగుతుండడంతో కొత్తగా నిర్మిస్తున్న ప్లాంట్‌లకు కూడా సింగరేణి బొగ్గును సరఫరా చేయాలని ఎన్‌టిపిసి కోరుకుంటుంది. ఈ ఒప్పంద కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ కంపెనీ నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూమెంట్) జె.ఆల్విన్, జి.ఎం (మార్కెటింగ్) కె.రవిశంకర్, డి.జి.ఎం. (మార్కెటింగ్) మారెపల్లి వెంకటేశ్వర్లు, ఎన్‌టిపిసి నుంచి రీజనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనీష్ జవహరి, చీఫ్ జిఎం ఎన్.ఎన్‌రావు, ఎజిఎం పికె రావత్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News