సమరానికి సర్వం సిద్ధం
ఆత్మవిశ్వాసంతో ఢిల్లీ, సమరోత్సాహంతో ముంబై
నేడు ఐపిఎల్ ఫైనల్ పోరు
దుబాయి: సుదీర్ఘ కాలంగా యూఎఇ వేదికగా సాగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్ తుది అంకానికి చేరుకుంది. మంగళవారం జరిగే తుది సమరంలో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్తో తాడో పేడో తేల్చుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ సిద్ధమైంది. ముంబై ఇండియన్స్ ఇప్పటికే నాలుగు సార్లు ఐపిఎల్ విజేతగా నిలిచింది. మరోవైపు ఢిల్లీ తొలిసారి ఫైనల్కు చేరుకుంది. తొలి క్వాలిఫయర్లో ముంబై చేతిలో చిత్తుగా ఓడిన ఢిల్లీ రెండో క్వాలిఫయర్లో హైదరాబాద్ను ఓడించి తుది పోరుకు దూసుకొచ్చింది. కిందటి మ్యాచ్లో ముంబై చేతిలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకోవాలనే పట్టుదలతో శ్రేయస అయ్యర్ సేన కనిపిస్తోంది. శిఖర్ ధావన్ భీకర ఫామ్లో ఉండడం ఢిల్లీకి కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. హైదరాబాద్పై మెరుపులు మెరిపించిన ధావన్ ఈసారి కూడా జట్టుకు కీలకంగా మారాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన ధావన్ విజృంభిస్తే ముంబైను ఓడించడం ఢిల్లీకి అసాధ్యమేమి కాదు.
ఇక స్టోయినిస్ రూపంలో ప్రపంచ శ్రేణి ఆల్రౌండర్ ఉండనే ఉన్నాడు. కిందటి మ్యాచ్లో స్టోయినిస్ ఇటు బ్యాట్తో అటు బంతితో చెలరేగి పోయాడు. కీలకమైన ఫైనల్లో కూడా ఇదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా బ్యాట్ను ఝులిపించాలనే లక్షంతో పోరుకు సిద్ధమయ్యాడు. జట్టును ముందుండి నడిపించాలనే పట్టుదలతో అయ్యర్ ఉన్నాడు. హెట్మెయిర్ కూడా జోరుమీదున్నాడు. హైదరాబాద్పై అతను మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈసారి కూడా చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నాడు. బౌలింగ్లోనూ ఢిల్లీ బాగానే కనిపిస్తోంది. స్టోయినిస్, అక్షర్ పటేల్, అశ్విన్లకు తోడుగా ప్రధాన అస్త్రం రబడా ఉండనే ఉన్నాడు. హైదరాబాద్ విజయంలో రబడా కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. నాలుగు వికెట్లు తీసి జట్టును గెలిపించిన రబడా ఫైనల్లో కూడా జట్టుకు అండగా నిలువాలని భావిస్తున్నాడు. హైదరాబాద్ను ఓడించిన ఉత్సాహంతో ఉన్న ఢిల్లీ తొలి ప్రయత్నంలోనే ఐపిఎల్ ట్రోఫీని సొంతం చేసుకోవాలనే పట్టుదలతో పోరుకు సిద్ధమైంది.
జోరు సాగిస్తారా
ఇక ఇప్పటికే నాలుగు సార్లు ఐపిఎల్ను ముద్దాడిన ముంబై ఐదో ట్రోఫీపై కన్నేసింది. అసాధారణ ఆటతో ముంబై చెలరేగి పోయింది. సమష్టి ఆటతో పెద్ద పెద్ద జట్లను సయితం అలవోకగా ఓడిస్తూ ఫైనల్కు దూసుకొచ్చింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ముంబై చాలా బలంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. డికాక్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కృనాల్ పాండ్య, హార్దిక్ పాండ్య, పొలార్డ్ వంటి మ్యాచ్ విన్నర్లు ముంబైలో ఉన్నారు. డికాక్, సూర్యకుమార్, హార్దిక్, కిషన్ అసాధారణ బ్యాటింగ్తో చెలరేగి పోతున్నారు. ఇక హార్దిక్, పొలార్డ్లు కీలక సమయంలో విధ్వంసక ఇన్నింగ్స్తో జట్టుకు అండగా నిలుస్తున్నారు. మరోవైపు ట్రెంట్ బౌల్ట్, బుమ్రా, పాటిన్సస్, కృనాల్, రాహుల్ చాహర్ తదితరులతో ముంబై బౌలింగ్ కూడా చాలా పటిష్టంగా ఉంది. దీంతో ఈసారి కూడా ముంబైనే ఫేవరెట్గా కనిపిస్తోంది. అయితే ప్రతిభావంతులైన ఆటగాళ్లతో కూడిన ఢిల్లీని కూడా తక్కువ అంచనా వేయలేం. రెండు జట్లలోనూ స్టార్ ఆటగాళ్లు ఉండడంతో ఫైనల్ సమరం నువ్వానేనా అన్నట్టు సాగడం ఖాయం.
IPL 2020 Final: MI vs DC Match Tomorrow