పార్టీ వీడిందివారి వల్లే : సింధియా
న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్ మాజీ సిఎంలు దిగ్విజయ్ సింగ్, కమల్ నాథ్లు ఘరానా గద్దార్లని బిజెపి నేత జ్యోతిరాదిత్య సింధియా విరుచుకుపడ్డారు. వారి వల్లనే తాను కాంగ్రెస్ పార్టీని వీడి బయటకు రావాల్సి వచ్చిందన్నారు. వీరు సిఎంలుగా వెలగబెట్టిన కాలంలో అంతా అవినీతిమయం అయిందని, ప్రజా సమస్యలను గాలికొదిలేసి, అప్పటివరకూ ప్రజలుంచిన విశ్వాసానికి ద్రోహం చేశారని సింధియా విరుచుకుపడ్డారు. తాను ఎన్నోసార్లు ప్రజా సమస్యలను ప్రస్తావించానని, అయితే ఈ పెద్ద మనుష్యులు పట్టించుకోలేదని, అందుకే విసిగిపోయి తాను పార్టీని వీడాల్సి వచ్చిందని సింధియా తెలిపారు. రాహుల్కు అత్యంత సన్నిహితుడైన జ్యోతిరాదిత్య సింధియా తొటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పార్టీ వీడారు. బిజెపిలో చేరి తరువాత ఆ పార్టీ నుంచి ఎంపి అయ్యారు. ఆయన కాంగ్రెస్ను వీడటంతో అత్యంత కీలకమైన మధ్యప్రదేశ్లో కమల్ నాథ్ నాయకత్వపు కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది. బిజెపి ప్రభుత్వం వచ్చింది.
ప్రజా సమస్యలపై పట్టించుకోవాలని సమయం వచ్చినప్పుడల్లా చెపుతూ వచ్చానని, అయితే ఈ ఇద్దరూ అవినీతిమయమైన సర్కారులకు పెత్తనం వహిస్తూ ప్రజలను దెబ్బతీశారని సింధియా విమర్శించారు. నవంబర్ 3 వ తేదీన మధ్యప్రదేశ్లో ఏకంగా 28 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఈ దశలో సింధియా స్పందించారు. ఈ ఉప ఎన్నికలలో మొత్తం కాకపోయినా బిజెపి అత్యధిక స్థానాలను గెల్చుకుని తీరుతుందని ఈ నేత విశ్వాసం వ్యక్తం చేశారు. కమల్నాథ్, దిగ్విజయ్లు కలిసికట్టుగానే ప్రజల సమస్యలను పక్కకుపెడుతూ వారి సొంత పనులు చక్కదిద్దుకుంటూ వచ్చారని, ఈ విధంగా ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తూ వచ్చారని, పైగా సొంతపార్టీకి నమ్మకద్రోహం చేశారని, వీరి వైఖరితో విసిగిపొయ్యే తాను పార్టీ వీడాల్సి వచ్చిందన్నారు.