Monday, April 29, 2024

నర్సింగ్ విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంది

- Advertisement -
- Advertisement -

టిఎస్ ఆర్‌టిసి నర్సింగ్ కళాశాల ప్రారంభోత్స కార్యక్రమంలో
ఆర్‌టిసి చైర్మన్‌బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి

మన తెలంగాణ / హైదరాబాద్: నర్సింగ్ విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉందని ఆర్‌టిసి ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి అన్నారు. శనివారం తార్నాకలో రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో రూ.10 కోట్ల వ్యయంతో నాలుగు అంతస్థుల భవనాన్ని ఆయన ఆర్‌టిసి ఎండి సజ్జనార్‌తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా తరగతి గదులు, ల్యాబొరేటరీలను వారు పరిశీలించారు. నూతన భవనంలో విద్యార్థులకు కల్పిస్తోన్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ మాట్లాడుతూ.. సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తార్నాక టీఎస్‌ఆర్టీసీ ఆస్పత్రికి అనుసంధానంగా 2021-22 విద్యా సంవత్సరం నుంచి నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేశామని తెలిపారు.

నర్సింగ్ కోర్సులు పూర్తి చేసిన వారికి వైద్య రంగంలో మంచి భవిష్యత్ ఉందని, విద్యార్థులందరూ టీఎస్‌ఆర్టీసీ అందిస్తోన్న నర్సింగ్ కోర్సులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆసుపత్రుల్లో నర్సులు కుటుంబసభ్యుల్లాగా రోగులను పరిగణించి.. అత్యుత్తమ సేవలను అందిస్తున్నారన్నారు. చికిత్స సమయంలో రోగులకు తల్లికంటే ఎక్కువగా సేవలు అందిస్తూ ఎందరో ప్రాణాలను నిలబెడుతున్న నర్సుల సేవలు ఎనలేనివని కొనియాడారు. ఎండీ పట్టుదల, వ్యూహాత్మక నిర్ణయాలతో సంస్థ పురోభివృద్ధి సాధ్యం అవుతోందని, తాను చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సమయం నాటికి ఇప్పటికి సంస్థలో గణనీయంగా నష్టాలు తగ్గుముఖం పట్టాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద మనసుతో సంస్థ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ నిర్ణయం తీసుకున్నారని, ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వి.సి.సజ్జనర్ మాట్లాడుతూ, నర్సింగ్ కోర్సుకు మంచి డిమాండ్ ఉన్నది. కోర్సు పూర్తి చేసిన నర్సింగ్ విద్యార్థులకు విదేశాలలోనూ అవకాశాలు మెండుగా లభిస్తున్నాయి. అందుకే, కష్టపడి చదివి విద్యార్థులు నైపుణ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని పేర్కొన్నారు. గత కొన్నేళ్ల క్రితం నర్సింగ్ కళాశాలను పెట్టాలని ఆలోచించిందనే విషయాన్ని గుర్తు చేస్తూ నేడు స్పల్ప వ్యవధి 12 నెలల కాలంలోనే నర్సింగ్ కళాశాల భవనం మెరుగైన సదుపాయాలతో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిందన్నారు. ఇది గోల్డెన్ ఛాన్స్ అంటూ నర్సింగ్ విద్యార్థులు బాగా చదువుకుని అటు కుటుంబ సభ్యులకు, ఇటు సంస్థకు మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు. నర్సింగ్ కళాశాల భవనాన్ని రూ.10కోట్లతో నిర్మించడం జరిగిందని, ఈ కళాశాల 50 మంది విద్యార్థులతో 2021-22 విద్యా సంవ్త్స్రంలో ప్రారంభమైన ఈ కళాశాలలో మేనేజ్‌మెంట్ కోటా 20 సీట్లలో ఆర్‌టిసి ఉద్యోగుల పిల్లలకు యూనివర్సిటీ విద్యార్థులతో సమానంగా ఐదు సీట్లు కేటాయించడం జరుగుతోందని తెలిపారు.

నర్సింగ్ కోర్సులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినులు త్రిష, అమూల్యను ఘనంగా సన్మానించారు. త్రిషకు రూ.10 వేలు, అమూల్యకు రూ.7 వేల నగదు పురస్కారాలతో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి.రవీందర్, తార్నాక ఆసుపత్రి సలహాదారు, ఓఎస్డీ సైదిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఎ, ఎం, పి అండ్ ఎం) కృష్ణకాంత్, జాయింట్ డైరెక్టర్ (విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ) సంగ్రామ్ సింగ్ జి. పాటిల్, సీఈఈ రాంప్రసాద్, సీఎఫ్‌ఎం విజయపుష్ఫ, తార్నాక టీఎస్‌ఆర్టీసీ ఆస్పత్రి సూపరింటెండెంట్ శైలజా కృష్ణమూర్తి, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ వసుంధర తులసి, తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News