Monday, April 29, 2024

స్వాపరాధ ప్రమాదాల్లో నిర్లక్ష్య నిరూపణ కీలకమే : సుప్రీం కోర్టు

- Advertisement -
- Advertisement -

Some Act Should Be Attributed To Person Supreme Court says

న్యూఢిల్లీ : రహదారుల్లో జరిగే ప్రమాదాలకు బాధిత వ్యక్తి పొరపాటు కూడా కొంత వరకు కారణమని (కంట్రిబ్యూటరీనెగ్లిజెన్స్) విశ్వసించడానికి అతను /ఆము కర్తవ్య ఉపేక్షకు సంబంధించిన ఆరోపణలు కూడా నిరూపణ కావాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కారు నడుపుతూ ప్రమాదంలో మృతి చెందిన తన భర్తకు వ్యతిరేకంగా కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ అతని భార్య, పిల్లలు దాఖలు చేసిన అప్పీలుపై జస్టిస్ హేమంత్ గుప్త, జస్టిస్ వి.రామసుబ్రమణియన్ ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఎదురుగా ఉన్న లారీని ఢీకొట్టిన ఘటనలో మరణించిన ఆమె భర్త నిర్లక్షం కూడా ఉన్నందున 50 శాతం పరిహారానికి మాత్రమే వారు అర్హులని హైకోర్టు పేర్కొంది. ఈ తీర్పును సుప్రీం కోర్టు సవరిస్తూ మృతుడి భార్య, పిల్లలకు పూర్తి స్థాయి పరిహారాన్ని (రూ.89 లక్షలు) 9 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని ఆదేశించింది.

ప్రమాదాన్ని తప్పించడానికి అసాధారణ జాగ్రత్త తీసుకోలేక పోవడాన్ని నిర్లక్షంగా నిర్ధారించరాదని ధర్మాసనం స్పష్టం చేసింది. జరిగిన ప్రమాదంలో బాధితుడి పొరపాటు కూడా ఉందని (కంట్రిబ్యూటరీ నెగ్లిజెన్స్) నిర్ధారణకు రావాలంటే అందుకు దారి తీసిన నిర్లక్షపూరిత చర్య లేదా కర్తవ్య ఉపేక్షను నిరూపించాల్సి ఉంటుందని తీర్పులో పేర్కొంది. కారు నడుపుతున్న వ్యక్తి మరింత జాగ్రత్తగా ఉన్నా, ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించి ఉన్నా ప్రమాదాన్ని నివారించ గలిగే వారంటూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు సాక్షాల ఆధారంగా చేసినవి కావని తెలిపింది. వాహనాన్ని అతివేగంగా నడిపినట్టు కానీ, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినట్టు కానీ, కారులో ఉన్న వ్యక్తిపై ఆరోపణలు నమోదు కాలేదని గుర్తు చేసింది.

రహదారిపై లారీని నిలిపి ఉంచకపోయినట్టయితే కారును వేగంగా నడిపినా ప్రమాదం జరిగేది కాదని హైకోర్టు వ్యాఖ్యలను ఈ సందర్భంగా ధర్మాసనం ప్రత్యేకంగా గుర్తు చేసింది. 2011 పిబ్రవరి 10 న సీనియర్ డిజైనర్‌గా ఉద్యోగం చేస్తున్న వ్యక్తి (32) కారును నడుపుకుంటూ వెళ్తూ ఎదుట ఉన్న లారీని ఢీ కొట్టారు. తీవ్రగాయాలతో ఘటనా స్థలం లోనే మృతి చెందారు. వేగంగా వెళ్తున్న లారీని దాని డ్రైవర్ ఎలాంటి సూచిక ఇవ్వకుండానే అకస్మాత్తుగా నిలిపివేయడంతో ఈ ప్రమాదం జరిగిందని రూ. 54 లక్షల పరిహారం ఇప్పించాలని మృతుడి భార్య పిల్లలు, .. మోటారు యాక్సిడెంట్ క్లెయిమ్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. ఆ తర్వాత ఈ కేసు కర్ణాటక హైకోర్టుకు రాగా, అక్కడ పరిహారంలో సగం మొత్తానికే అర్హులంటూ తీర్పు వెలువడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News