నాలుగు రోజుల ముందే రాక
16వ తేదీన అండమాన్ నికోబర్ దీవులకు
నేడు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం
మనతెలంగాణ/హైదరాబాద్ : ఈ సంవత్సరం నాలుగు రోజుల ముందే నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఓ చల్లటి కబురు మోసుకొచ్చింది.
దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో రవాణా వ్యవస్థ, ఫ్యాక్టరీలు మూతపడటం, గాలిలో కార్బన్ డై ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి వాయువుల మోతాదు తగ్గింది. ఈ నేపథ్యంలో వాతావరణంలో వేడి తగ్గింది. ఫలితంగా నైరుతి రుతుపవనాలు త్వరగా వచ్చేందుకు అనువైన వాతావరణం ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో మే 16వ తేదీన నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవుల్ని చేరబోతున్నాయని వాతావరణ శాఖ శుభవార్తను అందించింది.
మే 13వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతోందని అది మూడు రోజుల్లో బలంగా మారి మధ్య బంగాళాఖాతాన్ని చేరుతుందని, ఫలితంగా వర్షాలు కురిసేందుకు అనువైన వాతావరణం ఏర్పడనుందని వాతావరణ శాఖ ఓ అంచనాకు వచ్చింది. ఇక మహారాష్ట్రలోని విదర్భ నుంచి మొదలై తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ఉపరితలద్రోణి కారణంగా కోస్తా, రాయలసీమలో, తెలంగాణలోని కొన్నిచోట్ల మంగళవారం రాత్రి, బుధ, గురు వారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.