ఎన్నికలు సక్రమమే అన్నందుకు శిక్ష
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ తాను చేస్తున్న వాదనలను విభేదించి అమెరికా చరిత్రలోనే నవంబర్ 3 ఎన్నికలు అత్యంత సురక్షితమైనవిగా అభివర్ణించిన హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగానికి చెందిన సైబర్సెక్యూరిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ(సిఐఎస్ఎ) డైరెక్టర్ క్రిస్టఫర్ క్రెబ్స్ను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బర్తరఫ్ చేశారు. ఈ విషయాన్ని ట్రంప్ మంగళవారం ట్విట్టర్లో ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ గెలుపును అంగీకరించని ట్రంప్ ఎన్నికల అక్రమాలు జరిగాయంటూ వివిధ రాష్ట్రాలలోని కోర్టులలో పిటిషన్లు దాఖలు చేశారు. తన ఆరోపణలకు బలం చేకూర్చే ఆధారాలు ఇప్పటివరకు ట్రంప్ సమర్పించలేదు.
నవంబర్ 3న జరిగిన అధ్యక్ష ఎన్నికల భద్రతపై క్రిస్ క్రెబ్స్ చేసిన తాజా ప్రకటన అసంబద్ధమైనదని ట్రంప్ తన ట్వీట్లో పేర్కొన్నారు. చనిపోయిన వ్యక్తులు వోటు వేయడం, ఎన్నికల పరిశీలకులను పోలింగ్ కేంద్రాలలోకి అనుమతించకపోవడం, వోటింగ్ యంత్రాలలో లోపాల వల్ల తనకు వేసిన వోట్లు బైడెన్కు బదిలీ కావడం, గడువు ముగిసినా వోటింగ్ కొనసాగడం వంటి అనేక ఎన్నికల అక్రమాలు చోటుచేసుకున్నాయని ట్రంప్ ఆరోపించారు. ఈ కారణంగానే క్రిస్ క్రెబ్స్ను తక్షణమే పదవి నుంచి తొలగించినట్లు ట్రంప్ ప్రకటించారు.
అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి అనంతరం రక్షణ మంత్రి మార్క్ ఎస్పెర్ను తప్పించిన ట్రంప్ జనవరిలో పదవి నుంచి తప్పుకునేలోగా సిఐఎ డైరెక్టర్ గినా హాస్పెల్, ఎఫ్బిఐ డెరెక్టర్ క్రిస్టఫర్ వ్రేను కూడా బర్తరఫ్ చేస్తారన్న ఊహాగానాలు సాగుతున్నాయి. ఇదిలా ఉండగా.. తనను బర్తరఫ్ చేయడం పట్ల క్రిస్ క్రెబ్స్ స్పందిస్తూ పదవి పోయినందుకు తనకు ఎటువంటి విచారం లేదని వ్యాఖ్యానించారు. తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించినందుకు గర్వ పడుతున్నానని, దేశ ఎన్నికల వ్యవస్థను కాపాడగలిగానని ఆయన పేర్కొన్నారు. కాగా..క్రెబ్స్ బర్తరఫ్పై పలువురు అమెరికన్ పార్లమెంట్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. ఇది మంచి చర్య కాదని వారు అభిప్రాయపడ్డారు.