కృష్ణా నది యాజమాన్య బోర్డుకు ఇఎన్సి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం లేఖ
రెండు రాష్ట్రాలకు సమానంగా నీటిని పంచాలి
కృష్ణానదికి వరద నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తికి అనుమతి ఇవ్వాలి
ఎపి విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు
శ్రీశైలం, సాగర్, పులిచింతలలో గరిష్ట విద్యుత్ ఉత్పత్తిని అనుమతించాలని వినతి
మన తెలంగాణ/హైదరాబాద్: కృష్ణా జలాల వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు(కెఆర్ఎంబి)కి లేఖ రాసింది. ప్రభుత్వం తరఫున నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ ఈ లేఖను పంపించారు. పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తరలించాలంటే త్రిసభ్యకమిటీ ఆమోదం ఉండాల్సిందేనని ఈ లేఖలో ఆయన స్పష్టం చేశారు. త్రిసభ్యకమిటీ ఆమోదించకుండా పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తరలించేందుకు అనుమతి ఇవ్వకూడదని కృష్ణా బోర్డు ను ఆయన కోరారు. రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలా ల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ జరుపుతున్నందున 2021-22 వాటర్ ఇయర్ నుంచి రెం డు రాష్ట్రాలకు సమానంగా నీటిని పంచాలని ఆ లేఖలో ఆయన కోరారు. కృష్ణానదికి వరద పోటెత్తిన నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తికి అనుమతి ఇవ్వాలని, ఎపి జ ల విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటే తమకు ఎటువంటి అ భ్యంతరం లేదని కూడా ఈ లేఖలో ఆయన పేర్కొన్నారు. శ్రీశైలం, సాగర్, పులిచింతలలో గరిష్ట విద్యుత్ ఉత్పత్తికి అనుమతి ఇవ్వాలని ఈఎన్సీ మురళీధర్ విజ్ఞప్తి చేశారు. ఎత్తిపోతల పథకాలు, బోర్లకు విద్యుత్ ఉత్పత్తి అవసరమని ఆయన ఆ లేఖలో వివరించారు. కృష్ణా బేసిన్ అవసరాలకే జలాలను వినియోగించాలన్నారు. బేసిన్ వెలుపలకు ఎపి ప్రభుత్వం నీటిని తరలించకుండా చూడాలన్నారు. కృష్ణా నదికి వరద నీరు పోటెత్తుతోంది. వరద అధికంగా ఉండటంతో విద్యుత్ ఉత్పత్తికి అనుమతి ఇవ్వాలని ఆ లేఖలో ఆయన కోరారు. శ్రీశైలంతో పాటు నాగార్జునసాగర్, పులిచింతలలో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేపట్టడంపై గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రధానమంత్రికి, కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో పరిస్థితి వివరిస్తూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఇటీవల లేఖ రాసింది. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిపై కొద్ది రోజులు క్రితం ఎపి లేఖ రాయగా, నిలిపివేయాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు తెలంగాణకు లేఖ రాసింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తరఫున ఈఎన్సీ మురళీధర్ ఈ లేఖను కెఆర్ఎంబికి పంపించారు.
TS Govt letter to Krishna Board over water dispute