చెన్నై: కులాంతర వివాహం చేసుకున్నందుకు వరుడి కుటుంబంపై వధువు కుటుంబ సభ్యులు దాడి చేసి పెళ్లి కుమార్తెను కిడ్నాప్ చేసిన సంఘటన తమిళనాడులోని సాలెమ్ జిల్లాలో చోటుచేసుకుంది. తన భార్యను ఆమె కుటుంబ సభ్యులు కిడ్నాప్ చేశారని స్థానిక పోలీస్ స్టేషన్ లో వరుడు ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఎరోడ్ జిల్లా గురుపానయకపాలయామ్ ప్రాంతం భవాని గ్రామంలో బిసిలోని వన్నియార్ కులానికి చెందిన జె ఇలమతి(23), కవంతాపాడి గ్రామం ఎస్టిలోని అరుంతాతియార్ కులానికి చెందిన పి సెల్వన్ (25)లు గాఢంగా ప్రేమించుకున్నారు. ఇద్దరు కులాలు వేరు కావడంతో అమ్మాయి తల్లిదండ్రులు ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదు. సాలెమ్ జిల్లా కవలండియుర్లో ద్రావిడర్ విదుతలై కఝగమ్ సంస్థ నేతృత్వంలో సెల్వన్, ఇలమతి సోమవారం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇలమతిని తన ఇంటికి సెల్వన్ తీసుకెళ్లాడు. సోమవారం రాత్రి ఇలమంతి తండ్రి తన బంధువులతో కలిసి సెల్వన్ ఇంటికి వచ్చారు. సెల్వన్, ఆయన కుటుంబ సభ్యులపై దాడి చేసి ఇలమతిని తీసుకెళ్లారు. వెంటనే సెల్వన్ తన తండ్రితో కలిసి కోళతుర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఇలమతి తండ్రి, దాడి చేసిన బంధువులపై 141, 148, 441, 323, 365, 342, 506 ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి 18 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం ఇలమతి జాడ మాత్రం ఆమె కుటుంబ సభ్యులు చెప్పడం లేదు. ఇలమతిని తన బంధువుల ఇంట్లో బంధించి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.