మన తెలంగాణ/హైదరాబాద్: భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో మరణించిన కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు కుటుంబాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పరామర్శించారు. సోమవారం మధ్యాహ్నం సూర్యాపేటకు చేరుకున్న కేసిఆర్, ముందుగా సంతోష్ చిత్రపటానికి పూలుజల్లి అంజలి ఘటించారు. అనంతరం సంతోష్ భార్య సంతోషి, తల్లితండ్రులు మంజుల, ఉపేందర్, సోదరి శృతిలను సిఎం ఓదార్చారు. సంతోష్ పిల్లలు, అభిగ్న, అనిరుధ్ తేజలతోనూ మాట్లాడారు. దేశరక్షణ కోసం సంతోష్ ప్రాణత్యాగం చేశారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కొనియాడారు.
సంతోష్ మరణం తనను ఎంతగానో కలిచివేసిందని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రభుత్వం సంతోష్ కుటుంబానికి ఎల్లవేళ్లలా అండగా వుంటుందని హామి ఇచ్చారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తమను సంప్రదించాలని చెప్పారు. సంతోష్ కుటుంబ బాగోగులు చూసుకోవాలని మంత్రి జగదీశ్ రెడ్డిని ముఖ్యమంత్రి కోరారు. సంతోష్ భార్య సంతోషీకి గ్రూప్ వన్ ఉద్యోగం ఇచ్చే నియామక పత్రాన్ని ముఖ్యమంత్రి స్వయంగా అందజేశారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో 711 గజాల స్థలానికి సంబంధించిన పత్రాన్ని సంతోష్ భార్యకు ముఖ్యమంత్రి అందించారు. సంతోష్ భార్యకు రూ. 4 కోట్ల చెక్కును, తల్లితండ్రులకు రూ.1 కోటి చెక్కును ముఖ్యమంత్రి అందించారు.
CM KCR Tribute to Colonel Santosh babu