ముంబయి: వ్యాక్సిన్ డోసుల కొరత కారణంగా బుధవారం ముంబయిలోని పురపాలక, ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాలలో కొవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. మళ్లీ వ్యాక్సిన్ సరఫరా జరిగిన వెంటనే వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపడతామని బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బిఎంసి) బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. వ్యాక్సిన్ నిల్వలు లభించిన తర్వాత నగర ప్రజలకు వాటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియచేస్తామని తెలిపింది.
వ్యాక్సిన్ల కొరత కారణంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోవడం నగరంలో ఈ నెలలో ఇదే మొదటిసారి. ఇదే కారణంతో గత నెలలో మూడుసార్లు వ్యాక్సినేషన్ ప్రక్రియ నగరంలో నిలిచిపోయింది. ఇప్పటివరకు నగరంలో 73,36,171 మందికి వ్యాక్సినేషన్ జరిగిందని బిఎంసి తెలిపింది. వీరిలో 18,09,075 మంది రెండు డోసులు పూర్తి చేసుకున్నారని వివరించింది.ప్రస్తుతం ముంబయిలో మొత్తం 428 కొవిడ్-19 వ్యాక్సినేషన్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటిలో 294 కేంద్రాలను బిఎంసి నిర్వహిస్తుండగా 20 కేంద్రాలను ప్రభుత్వం, 114 కేంద్రాలను ప్రైవేట్ ఆస్పత్రులు నిర్వహిస్తున్నాయి.