ఢిల్లీ: దేశ వ్యాప్తంగా రెడ్జోన్లో 130 జిల్లాలు ఉన్నాయని, ట్రక్కుల రవాణాకు అనుమతి ఇవ్వాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సరకు రవాణాకు ఇబ్బందులు లేకుండా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. స్వస్థలాలకు వెళ్లేందుకు వలస కూలీలు, విద్యార్థులకు అనుమతి ఇవ్వాలని ఆదేశించారు. రాష్ట్రాలు ఇప్పటి వరకు 62 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాయన్నారు. రైళ్ల ద్వారా వలస కూలీలు, విద్యార్థులు, యాత్రికుల తరలింపునకు కేంద్రం అనుమతి ఇచ్చిందన్నారు. ప్రస్తుతం దేశంలో నిత్యావసరాలకు ఎలాంటి కొరత లేదన్నారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1993 కరోనా కేసులు నమోదయ్యాయని, కరోనా నుంచి కోలుకునే వారి శాతం 25.37 శాతంగా ఉందన్నారు. భారత్ దేశంలో ఇప్పటి వరకు 35,043 కేసులు నమోదు కాగా 1159 మంది మృత్యువాతపడ్డారు. కరోనా వ్యాధి నుంచి 9274 మంది కోలుకున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనా రోగుల సంఖ్య 1038కి చేరుకోగా 28 మంది మృత్యువాతపడ్డారు.