సెప్టెంబర్ 14నుంచి పార్లమెంటు, పార్లమెంటు కేబినెట్ కమిటీ సిఫార్సు
18 రోజులు సమావేశాలు జరిగే అవకాశం
కొవిడ్ నేపథ్యంలో సభ్యుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
ఉభయ సభల్లో సభ్యులు కూర్చునే వీలు
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల తేదీలు దాదాపు ఖరారయ్యాయి. వచ్చే నెలలో ఈ సమావేశాలు నిర్వహించే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 14నుంచి అక్టోబర్ 1వరకు పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహారా కేబినెల్ కమిటీ సూచించినట్లు తెలుస్తోంది. శని, ఆదివారాల్లోను ఉభయ సభలు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఉదయం నాలుగు గంటలపాటు ఒక సభ, సాయంత్రం నాలుగు గంటలపాటు మరో సభ నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం. మొత్తం 18 రోజులు పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. కాగా కరోనాతో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సమావేశాల నిర్వహణ కోసం అధికారులు ఉభయసభల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భౌతిక దూరం నిబంధనలకు అనుగుణంగా సభ్యులకు సీట్లు కేటాయించనున్నారు.
ఈసారి ఉభయసభల్లోను చాంబర్లు, గ్యాలరీల్లో సభ్యులకే సీట్లు కేటాయించనున్నారు. రాజ్యసభలో 60 మంది సభ్యులు చాంబర్లో, మరో 51 మంది గ్యాలరీల్లో కూర్చుంటారు. మిగిలిన 132 మంది సభ్యులు లోక్సభలో కూర్చుంటారు. ఇలా చేయడం భారత పార్లమెంటు చరిత్రలో 1952 తర్వాత ఇదే మొదటిసారి. లోక్సభలోను ఇదే తరహా ఏర్పాట్లు చేయనున్నారు. మొట్టమొదటి సారి ఆయా ప్రదేశాల్లో సభ్యులకు వీలుగా భారీ డిస్ప్లే స్క్రీన్లు, అల్ట్రా వైలెట్ కిరణాల ద్వారా వైరస్ను చంపే ఏర్పాట్లు, రెండు సభల మధ్య ప్రత్యేక కేబుళ్లు, సభ్యుల మధ్య పాలీ కార్బొనేట్ సెపరేటర్లు లాంటి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్యనాయుడు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాలు జులై 17న సమావేశమై పార్లమెంటు సమావేశాల నిర్వహణపై చర్చించారు.చాంబర్లు, గ్యాలరీలను సైతం సభ్యులు కూర్చునేందుకు ఉపయోగించాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ఆగస్టు మూడో వారానికల్లా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అప్పట్లో వెంకయ్య నాయుడు అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.
Parliament Monsoon Session 2020 begin on Sept 14