కొత్త ప్లాట్లకు అనుమతులు తప్పనిసరి
హైదరాబాద్ : వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు ఎల్ఆర్ఎస్ నిబంధనను ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ఒపెన్ ప్లాట్లు, నిర్మాణాలకు తదుపరి రిజిస్ట్రేషన్ కొనసాగించవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అనుమతులు లేని, క్రమబద్దీకరణ కాని కొత్త ప్లాట్లకు మాత్రమే రిజిస్ట్రేషన్లు చేసేందుకు అనుమతి నిరాకరించింది. కొత్త వెంచర్ల ప్లాట్లను అన్ని అమనుతులు ఉంటేనే రిజిస్ట్రేషన్లు జరుగుతాయని స్పష్టం చేసింది. అనుమతులు ఉన్న, క్రమబద్దీకరణ అయిన ప్లాట్ల రిజిస్ట్రేషన్లు యథాతథంగా కొనసాగుతాయని తెలిపింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లు, నిర్మాణాలకు అడ్డంకులు తొలగినట్లయింది.
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు గత వారమే ప్రారంభమైనప్పటికీ అన్ని అనుమతులు ఉన్న ఆస్తులకు మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగాయి. అనుమతులు లేని ప్లాట్లను, నిర్మాణాలకు రిజిస్ట్రేషన్లు చేయలేదు. దాంతో పాటు గత వారం రోజులుగా నామమాత్రంగానే రిజిస్ట్రేషన్లు జరిగాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లకు కూడా రిజిస్ట్రేషన్లు కానున్నాయి. ఎల్ఆర్ఎస్ పూర్తిగా చెల్లించకపోయినా రిజిస్ట్రేషన్లు జరుగనున్నాయి. రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ల విధానంలో సమూల మార్పులు తీసుకురావాలని భావించిన ప్రభుత్వం మూడు నెలల క్రితం ఇందుకోసం ధరణి వెబ్సైట్తో పాటు ఎల్ఆర్ఎస్ విధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ప్రతి ఫ్లాట్కు ఎల్ఆర్ఎస్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించిన ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ లేని వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది.