హైదరాబాద్: ప్రతి సంవత్సరం కోటి మంది ఆడబిడ్డలకు చీరలు ఇస్తున్నామని ఐటి, జౌళి శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. బతుకమ్మ రంజాన్, క్రిస్మస్ పండుగలకు చీరలు పంపిణీ చేస్తున్నామన్నారు. అక్టోబర్ 9 నుంచి బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తామని, హరితప్లాజాలో బతుకమ్మ చీరల ప్రదర్శన సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు. బతుకమ్మ చీరల తయారీతో నేతన్నలకు ఉపాధి కల్పిస్తున్నామని, నాలుగేళ్లలో 4 కోట్ల చీరలు పంపిణీ చేశామని తెలియజేశారు. 278 డిజైన్స్ లతో బంగారు, వెండి జరీ అంచులతో బతుకమ్మ చీరలు తయారు చేశారని, రూ.317.81 కోట్ల వ్యయంతో కోటికి పైగా బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తామన్నారు. స్కూల్ యూనిఫామ్స్ ఆర్డర్ ను కూడా నేతన్నలకే ఇస్తున్నామని, తెలంగాణలో ఇప్పుడు నేత కార్మికుల ఆత్మహత్యలు లేవని కెటిఆర్ స్పష్టం చేశారు.
ఉద్యమ సమయంలోనే నేతన్నలకు సంక్షేమానికి రూ.50 లక్షలు సిఎం కెసిఆర్ ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చిన తరువాత నేతన్నల సంక్షేమం కోసం బడ్జెట్ లో రూ.1200 కోట్లు కేటాయించామని, రైతు, నేతన్నల ఆత్మహత్యలను వేగంగా తగ్గించిన రాష్ట్రంగా తెలంగాణ అని కేంద్ర ప్రశంసించిందన్నారు. నూలు, రసాయనాల మీద 50 శాతం సబ్సిడీ ఇస్తున్నామని పేర్కొన్నారు. అతి కొద్ది కాలంలోనే ఫ్లోరైడ్ మహమ్మారిని తరిమికొట్టామన్నారు. కరోనా సంక్షోభంలో కూడా సంక్షేమ పథకాలు ఆగలేదని, రైతు బంధు, ఆసరా పింఛన్లు సమయానికి అందించామని, పేదలకు సంబంధించిన ఈ కార్యక్రమాన్ని ఆపలేదన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు.