రూ. 1500 నగదు బ్యాంకులో జమ
అర్హులైన ప్రతి పేదవారికి ఈనెలాఖరు వరకు అందజేత
బియ్యం, కిలో కందిపప్పు ఉచితంగా సరఫరా
మన తెలంగాణ/హైదరాబాద్: నగరంలో కరోనా వైరస్ విశ్వరూపం దాల్చడంతో సిఎం కెసిఆర్ పేదలంతా పస్తులుండకూడదని, ప్రతి ఒకరికి 12కేజీల బియ్యం ఉచితంగా పంపిణీ చేసినట్లు ప్రకటించారు. దీంతో మొదటి విడుత పంపిణీ ఏప్రిల్ 2వ తేదీ నుంచి లబ్ధిదారులకు ఉచితంగా బియ్యం అందజేశారు. రెండవ విడత పంపిణీలో బియ్యం, కంది పప్పుతో పాటు, రూ. 1500 నగదు బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం నగరంలోని పంజాగుట్టలో పౌరసరఫరాల చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ పేదలకు పంపిణీ చేసే కార్యక్రమం ప్రారంభించి పేదలను ఆదుకోవడమే తమ ప్రభుత్వ లక్షమని, నగర ప్రజలెవరు ఆకలితో ఉండకూడదన్నారు. ప్రతి ఒక కార్డుదారునికి సరుకులు అందేలా రేషన్ షాపులు నిత్యం ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు అందుబాటులో ఉండాలని డీలర్లను ఆదేశించారు. ఎవరికైనా బయోమెట్రిక్ మిషన్లలో వేలిముద్రలు మ్యాచ్కాకపోయి గత మూడు నెలల నుంచి సరుకులు తీసుకుంటే నిబంధనలు పక్కపెట్టి వారికి ఇవ్వాల్సిన రేషన్ డీలర్లు అందజేయాలని స్థానిక అధికారులు సూచిస్తున్నారు.
ఈనెల 31వరకు రేషన్ సరుకులు అందుబాటులో ఉంటున్నట్లు చెప్పారు. గ్రేటర్ పరిధిలో 09 సర్కిల్ ఉండగా 1545 రేషన్ దుకాణలుండగా, వీటి ద్వారా 11.10లక్షల ఆహార భద్రత కార్డులు, లబ్ధ్దిదారులు 43.42లక్షల యూనిట్లు , నెలసరి బియ్యం కేటాయింపు 28వేల మెట్రిక్ టన్నులు పంపిణీ చేస్తున్నారు. అదే విధంగా రూ. 1500 నగదు మే 2 తేదీ నుంచి సరుకులు తీసుకున్న వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నట్లు, ఒక వేళ బ్యాంకు ఖాతాలు లేకుండా రెండో వారం నుంచి స్థానికంగా ఉండే పోస్టాపీసుల్లో అందజేస్తున్నట్లు జిల్లా సివిల్ సప్లయి అధికారులు పేర్కొన్నారు.
మరోపక్క రేషన్కార్డుదారులు ఏప్రిల్ మాసంలో ప్రతికార్డు నగదు రూ. 1500 వేస్తామని చెప్పిన డబ్బులు ఇప్పటి వరకు బ్యాంకులో జమ కాలేదని వాపోతున్నారు. ఆన్లైన్ ద్వారా తనిఖీ చేసి బ్యాంకులో పడినట్లు ఉందని, బ్యాంకు వెళ్లి పరిశీలించగా నగదు జమ కాలేదని బ్యాంకు అధికారులు చెబుతున్నట్లు పేర్కొంటున్నారు. అదే విధంగా పోస్టాపీసు వద్దకు వెళితే కొంతమందికే నగదు పంపిణీ చేస్తూ సరిపడ్డ డబ్బులు రాలేదని లబ్ధ్దిదారులకు సమాధానం చెప్పి తిరిగి ఇంటికి పంపిస్తున్నారు. ఇప్పటికైనా పౌరసరఫరాల అధికారులు అసత్య ప్రచారాలు వీడి పేదలకు నగదు వచ్చే విధంగా చూడాలని కోరుతున్నారు.