గ్యాంగ్ రేప్నకు గురైన దళిత మహిళ
అవమాన భారంతో ఆత్మహత్య
న్యూఢిల్లీ : యుపిలోని హాథ్రస్ ఘటన మరవకముందే మధ్యప్రదేశ్లో మరో దారుణ సంఘటన వెలుగు చూసింది. నార్సింగ్పూర్ జిల్లా గాదర్వర ప్రాంతంలో సెప్టెంబర్ 28న దళిత మహిళ(32)పై ముగ్గురు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డ సంఘటన ఆలస్యంగా బయటపడింది. అవమాన భారంతో ఆమె ఈ నెల 2న ఆత్మహత్యకు పాల్పడ్డారు. పశువుల మేత కోసం వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్లినపుడు దుండగులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని బంధువులు తెలిపారు. చిచిలీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటనపై వెంటనే ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని బాధితురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్ట్ చేశారు.
అయితే, వీరిలో ఒకరు మాత్రమే రేప్ ఆరోపణులున్న నిందితుడు అరవింద్ చౌదరి. మిగతావారైన పర్సూచౌదరి, అనిల్రాయ్ పరారీలో ఉన్నట్టు సబ్డివిజనల్ పోలీస్ అధికారి(ఎస్డిఒపి) ఎస్ఆర్ యాదవ్ తెలిపారు. అరెస్టయిన మరో ఇద్దరిలో ఒకరు అరవింద్ తండ్రి కాగా, మరొకరు లీలాబాయి అనే మహిళ. ఈ నెల 2న నీళ్ల కుళాయి దగ్గర లీలాబాయ్ దుర్భాషలాడిన తర్వాతే అవమాన భారంతో బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడినట్టు కేసు నమోదైంది. ఈ సంఘటన తర్వాత బాధితుల ఫిర్యాదు తీసుకోవడంలో నిర్లక్షంగా వ్యవహరించిన స్థానిక ఎఎస్ఐ మిశ్రీలాల్ కొడపను సస్పెండ్ చేసినట్టు ఎస్ఆర్ యాదవ్ తెలిపారు.