న్యూఢిల్లీ: మరో 2,3 రోజుల్లో ఉద్యమ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని రైతు సంఘాలు తెలిపాయి. సుప్రీంకోర్టు ఏర్పాటు చేయనున్న కమిటీపై న్యాయ సలహా తీసుకుంటామని తెలిపాయి. అనుసరించాల్సిన వ్యూహంపై రైతు సంఘాలు చర్చిస్తున్నాయని రైతు నేత శివకుమార్ కక్కా తెలిపారు. కోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే కమిటీలో భాగస్వాములం కావాలా..? వద్దా..? అనే దానిపైనా రైతు సంఘాలు నిర్ణయిస్తాయని ఆయన తెలిపారు. వ్యవసాయ నిపుణులు, రైతు సంఘాల ప్రతినిధులతో నిష్పాక్షిక, స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు ఇటీవల సూచించిన విషయం తెలిసిందే. కాగా, తమ డిమాండ్లు సాధించే వరకూ ఆందోళన విరమించేది లేదని మరో రైతు నేత బల్బీర్సింగ్ స్పష్టం చేశారు.
కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో వేలాదిమంది రైతులు బైఠాయించి నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. నవంబర్ 26న మొదలైన వీరి ఆందోళన శనివారానికి 23 రోజులకు చేరుకున్నది. ఈ సమయంలో 33మంది రైతులు మరణించారని ఎఐకెఎస్ తెలిపింది. ప్రమాదాలు, అనారోగ్యం, అతిశీతల వాతావరణం వల్ల మరణాలు సంభవించాయని తెలిపింది. అమరులైన రైతులకు నివాళులర్పిస్తూ ఆదివారం దేశవ్యాప్తంగా స్మారక దినాన్ని పాటిస్తామని ఎఐకెఎస్ తెలిపింది.